భీమదేవరపల్లి, అక్టోబర్ 28 : ‘నియోజకవర్గంలో తిరుగమంటరు.. నీ వెనుక మేమున్నమంటరు.. పల్లెల్లో పాదయాత్ర చేసిన తర్వాత మరొకరికి టికెట ఇస్తరు.. తడిగుడ్డతో కాంగ్రెస్ నా గొంతు కోసింది’ అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి కార్యకర్తల ఎదుట తీవ్ర ఆవేదన చెందారు. శనివారం మండలంలోని ముల్కనూరులోని ఆయన నివాసంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘హుజూరాబాద్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున టిక్కెట్ ఇస్తమన్నరు..కేతిరి సుదర్శన్రెడ్డి ఉన్నారని వద్దన్నా.. నియోజకవర్గ విభజన తర్వాత హుస్నాబాద్ నుంచి టిక్కెట్ ఇస్తమన్నరు.. బొమ్మ వెంకన్న అంగీకరిస్తే సరే అని చెప్పిన.. అధిష్టానం టిక్కెట్ ఇస్తే గెలిచి వచ్చి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన. 2018లో కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తామని చెప్పింది. గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేసిన. సీపీఐకి పొత్తులో హుస్నాబాద్ పోతుంది అంటే ప్రచారం మానుకుంటానని చెప్పిన.. లేదు లేదు స్నేహపూర్వక పోటీ అన్నరు.
ఆ రోజు సాయంత్రం కల్లా బీ ఫామ్ ఇవ్వలే.. హైదరాబాద్లో నేనే కాదు నాయిని రాజేందర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఇద్దరు, హైదరాబాద్లో ఒక్కరు ఇట్ల చాలామందిమి ఉన్నం.. నామినేషన్ వేసేందుకు సిద్ధం కమ్మన్నరు. తీరా గాంధీభవన్కు వెళ్లేసరికి కాంగ్రెస్ పెద్దలు ఫోన్లు స్విచ్ఆఫ్ పెట్టుకున్నరు. ఎట్లనో కౌశిక్రెడ్డికి మాత్రం అప్పుడు బీఫామ్ ఇచ్చిన్రు. నేను కాంగ్రెస్ను ఏనాడూ విమర్శించలేదు.. అప్పుడు నా కార్యకర్తలు ఆగం కావద్దని బీఆర్ఎస్లో చేరిన. రాజకీయాలు వదిలి నా పనులు నేను చేసుకుంటుంటే మళ్లీ నన్ను కాంగ్రెస్లోకి రమ్మన్నరు. ఒకసారి జరిగిన అవమానం చాలని చెప్పిన. మూడు సర్వేలు చేసినం నియోజకవర్గంలో నీ పేరే ముందున్నది. గ్రామాల్లోకి వెళ్లుమని చెప్పిండ్రు. అయినా నేను నమ్మలేదు. చివరికి నన్ను ఢిల్లీకి తీస్కపోయి కాంగ్రెస్ కండువా కప్పిండ్రు. ఊరూరా పాదయాత్ర చేసిన. 80కి పైగా గ్రామాలు తిరిగి కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేసిన. హుస్నాబాద్ నియోజకవర్గ టిక్కెట్ కోసం నాతోపాటు పొన్నం ప్రభాకర్ దరఖాస్తు చేసుకున్నడు. అప్పటికీ పలుమార్లు వాళ్లను అడిగినా లేదు లేదు నువ్వే ప్రచారం చేసుకో అన్నరు.
తీరా సమయానికి తడిగుడ్డతో గొంతు కోసిండ్రు. హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానికులు లేరా? లేక వారు అసమర్థులా? పార్టీని బలోపేతం చేసి వచ్చాక కుర్చీలో స్థానికేతరులు కూర్చుంటారా’ అని మండిపడ్డారు. హుస్నాబాద్ ఆత్మగౌరవాన్ని వదిలి వలస నాయకులను తెచ్చుకుందామా? అని ప్రశ్నించారు. ‘నాకు వ్యవస్థలో గుర్తింపు ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షుడిగా ఉన్నా. ఇంట్లో ఉన్నవాన్ని పిలిచి కండువా కప్పి మోసం చేస్తారా?’ అని ఆవేదన చెందారు. మరోసారి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. సమావేశంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.