ములుగు, జనవరి 6(నమస్తే తెలంగాణ) : మాజీ నక్సలైట్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ములుగు ఏఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన మాజీ నక్సల్ బొట్ల అశో క్ ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన బాలుగు గణేశ్, జాకారం గ్రామానికి చెందిన పుల్యాల నవీన్ను మావోయిస్టు పార్టీలో చేరేలా ప్రోత్సహించాడు.
దళంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారాన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, ఓఎస్డీ గౌస్ఆలంకు విషయాన్ని చేరవేశారు. దీంతో ఓఎస్డీ ములుగు ఎస్సై ఓంకార్యాదవ్ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి మావోయిస్టు పార్టీలో చేరేందుకు యత్నించిన గణేశ్, నవీన్తో పాటు ప్రేరేపించిన మాజీ నక్సలైట్ అశోక్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్ తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి గ్రామాల్లోని యువకులు బలికావొద్దన్నారు. మావోయిస్టు పార్టీ భావజాలాన్ని నమ్మొద్దని, ఎవరైనా మావోయిస్టు పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ మేకల రంజిత్కుమార్, ఎస్సైలు ఓంకార్యాదవ్, లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.