ఖిలావరంగల్, ఏప్రిల్ 4: టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తూ కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని వరంగల్ ఆర్డీవో కార్యాలయంలోని ఆస్తులను జప్తు చేశా రు. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట గ్రామానికి చెందిన సముద్రాల స్వామి, అతని కూతురు వెన్నెలకు సంబంధించిన 20 ఎకరాల భూమిని ప్రభుత్వ టెక్స్టైల్ పార్కు కోసం తీసుకున్నారు. అయితే ఎకరానికి రూ.10 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పి భూమిలో రోడ్లు వేశారు. నష్ట పరిహారం తక్కువగా వస్తుందని పలు మార్లు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయి స్తే అప్పీల్కు వెళ్లమన్నారు.
దీంతో బాధితులు హైదరాబాద్లోని ల్యాండ్ అక్విజేషన్ అథారిటీని అశ్రయించడంతో ప్రభుత్వం, ఆర్డీవో వరంగల్ బాధితులకు రూ.2.40 కోట్లు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. డబ్బులు చెల్లించకుండా ఆలస్యం చేస్తుండడంతో బాధితులు ఎగ్జిక్యూటివ్ పిటీషన్ వేశారు. అయినప్పటికీ డబ్బులు చెల్లించకుండా ఆలస్యం చేస్తూ ఉత్తర్వులను అమలు చేయలేదని కోర్టు భావించి వరంగల్ ఆర్డీవో కార్యాలయం ఆస్తులు జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో గురువారం కోర్టు నుంచి వచ్చిన అధికారులు, సిబ్బంది ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని కోర్టు ఆర్డర్ను అంటించారు. అనంతరం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఏసీలు, కూలర్లు, ఆర్డీవో వాహనంతోపాటు ఇతరత్రా వస్తువులను జప్తు చేశారు.