ఎల్కతుర్తి, ఏప్రిల్ 10 : ఎన్నికల సమయంలో అడ్డగోలు అబద్ధాలు చెప్పి తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చి రైతుల నోట్లో మట్టి కొడుతున్నదని, రైతుల ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. రైతు సంఘాల ఆహ్వానం మేరకు మండలంలోని గోపాల్పూర్లో ఎండిన వరి పంటలను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి పరిశీలించారు. రైతులను ఎండిన పంటల వివరాలు అడిగి తెలుసుకొని ఓదార్చారు. దేవాదుల డీఈ వెంకటేశ్వర్లుతో ఫోన్లో మాట్లాడి నార్త్ కెనాల్ ద్వారా నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి తెచ్చిన కరువన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రైతుల బతుకులు ఆగమైపోతున్నాయన్నారు.
ఎండి న పంటలకు వెంటనే ప్రభుత్వం ఎకరాకు రూ. 25వేలు నష్టపరిహారంతో పాటు వారి హామీ మేరకు క్వింటాల్కు రూ. 500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందు కు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటి పోతున్నాయన్నారు. 2013లో సీఎంగా ఉన్న కిరణ్కుమార్రెడ్డి తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించొద్దని అప్పటి మహారాష్ట్ర సీఎంకు లేఖలు రాశారని, దీంతో ఆ ప్రభుత్వం ఒక్క ఎకరం కూడా భూసేకరణ చేసేది లేదని మెలిక పెట్టడంతోనే ఆగిపోయిందన్నారు. మేడిగడ్డ కింద ఉన్న దేవాదుల ద్వారా గోదావరి నీళ్లు వృథాగా పోతున్నా కూడా ప్రభుత్వం పంపులను నడపడం లేదని, విద్యుత్ బిల్లుల పేరుతో పొలాలను ఎండబెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ పేరుతో కేసీఆర్ను బద్నాం చేయాలనే అనాలోచిత నిర్ణయం తో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఇప్పటికీ వెయ్యి క్యూసెక్కుల నీళ్లు కిందకు పోతున్నా అవగాహన లేని ప్రభుత్వం పంపింగ్ చేయడం లేదని విమర్శించారు. అధైర్య పడొద్దని, ప్రభుత్వ మెడలు వంచైనా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే అప్పటి సీఎం కేసీఆర్తో మాట్లాడి ధర్మసాగర్ రిజర్వాయర్ నార్త్ కెనాల్ ద్వారా సాగునీళ్లు తీసుకొచ్చి ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు అందించినట్లు గుర్తు చేశారు. అప్పుడు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు అందించామని, ఇప్పుడు యాసంగిలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాల్పూర్లోనే 200 ఎకరాల్లో వరి పంట ఎండిపోవడం బాధాకరమన్నారు. ఎకరాకు రూ. 25వేలు ఇవ్వడంతో పాటు రైతు మరణిస్తే రూ. 25లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, రైతుబీమాను సక్రమంగా అందించాలన్నారు. కార్యక్రమంలో కేడీసీసీ డైరెక్టర్ శ్రీపతి రవీందర్గౌడ్, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పిట్టల మహేందర్, ఎంపీటీసీలు కడారి రాజు, చెవుల కొమురయ్య, నాయకులు ఎల్తూరి స్వామి, గుండా ప్రతాప్రెడ్డి, రాజేశ్వర్రావు, దేవేందర్రావు, శ్రీనివాస్రెడ్డి, కొమ్మిడి మహిపాల్రెడ్డి, హింగె శివాజీ, చదిరం నాగేశ్వర్, కార్తీక్, శ్రీనివాస్, భాస్కర్, రాజ్కుమార్ పాల్గొన్నారు.