బయ్యారం, మార్చి 11 : వేసవి ప్రారంభంలోనే కార్చిచ్చు అడవులను కాల్చేస్తున్నది. దీంతో వనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. బయ్యారం రేంజ్ పరిధిలో 20 బీట్లు ఉండగా సుమారు 18 వేల హెక్టర్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కొన్ని రోజులుగా బయ్యారం సెక్షన్ పరిధిలోని బయ్యారం, కస్తూరినగర్, లింగగిరి, కారుకొండ, లక్ష్మీపురం సెక్షన్ పరిధిలోని పందిపంపుల, వెంకటాపురం, లక్షీపురం, మొట్లతిమ్మాపురం సెక్షన్ పరిధిలోని బీరోనిమడవ, వినోభానగర్, మొట్లతిమ్మాపురం ఈస్ట్, వెస్ట్, గురిమళ్ల, ఆర్సీపురం బీట్లలోని అటవీ ప్రాంతాల్లో అడవులు దగ్ధమవుతున్నాయి.
బయ్యారం శివారులోని పెద్దగుట్టపై వారం రోజులుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. వృక్షాల ఆకులు ఎండి రాలడంతో అడవులకు వెళ్లే బాట సారులు, పశువులు, గొర్రెల కాపరులు చుట్ట, బీడి వంటికి కాల్చి పడేయడంతో పాటు సమీప గ్రామాలకు చెందిన రైతులు చేనుల్లో ఉన్న చెత్తను కాల పెట్టే క్రమంలో కార్చిచ్చు రగిలి మంటలు చెలరేగుతున్నాయి. అంతేకాకుండా తునికాకు సేకరణలో భాగంగా కొందరు వ్యక్తులు కొత్త చిగురు కోసం మంటలు పెడుతుంటారు.
వీటిని అధిగమించేందుకు అటవీ శాఖ ప్రతి ఏటా అటవీ ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తారు. మంటలు చెలరేగినా వీటివల్ల వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది సర్కారు ఫైర్ లైన్ల ఏర్పాటు కోసం నిధులు కేటాయించక పోవటంతో ఫైర్ లైన్ల ఏర్పాటు జరగలేదు. దీంతో అడవుల్లో మంటలు వాప్తి చెంది దగ్ధమవుతున్నాయి. శాటి లైట్ చాయాచిత్రాల ద్వారా అడవుల్లో మంటలు చెలరేగిన పాయింట్లను గుర్తించి అలవీ సిబ్బంది బ్లోయర్ల సహాయంతో ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోతున్నది. రానున్న రోజుల్లో అడవుల్లో మంటలు మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.
బూడిదవుతున్న వృక్ష సంపద
కార్చిచ్చుతో ఏండ్ల తరబడి సంరక్షించిన భారీ వృక్షాలు కాలి బూడిదవుతున్నాయి. అంతేకాకుండా నేలపై ఉన్న విత్తనాలు కాలిపోవడంతో కొత్త మొక్కలు మొలకెత్తక విలువైన వృక్ష జాతి అంతరించిపోయే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చర్యల వల్ల అడవుల విస్తీర్ణం పెరగడంతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ చర్యలతో వాటి సంతతి క్రమంగా పెరిగింది. కార్చిచ్చుతో అడవుల విస్తీర్ణం తగ్గడమే కాకుండా వన్య ప్రాణులు మనుగడకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి అడవులు అగ్నికి ఆహుతవుకుండా చూడాలని ప్రజలు కోరున్నారు.
మంటలు గుర్తించి ఆర్పుతున్నాం. .
అడవుల్లో చేలరేగిన మంటలను శాటిలైట్ చాయా చిత్రాల ద్వారా గుర్తించి ఆర్పేస్తున్నాం. వేసవి కాలం కావడంతో అడవుల్లో కార్చిచ్చు రగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బయ్యారం పెద్దగుట్టపై ఇటీవల చేలరేగిన అగ్గిని గుర్తించి వెంటనే ఆర్పేశాం. ప్రతి ఏడాది ఫైర్ లైన్ ఏర్పాటు వల్ల మంటలు అదుపులో ఉండేవి. నిధులు రాక పోవడంతో ఈ ఏడాది ఫైర్ లైన్ల ఏర్పాటు చేయలేదు. దీంతో కారుచిచ్చు కట్టడి కష్టతరంగా మారింది. సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– బీ రమేశ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, బయ్యారం