పుసుపు ధూళిలో తనువులు మెరిశాయి. మల్లన్న సేవలో మనసులు మురిశాయి. పట్నం వారం సందర్భంగా కొమురెల్లి క్షేత్రం, ఆలయ పరిసరాలు పసుపు వర్ణం అద్దుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం కోరమీసాల స్వామి నామాన్ని స్మరిస్తూ పంచవర్ణాల పెద్దపట్నాన్ని దాటి, పంచ పల్లవాల అగ్నిగుండంలో ప్రవేశించిన తీరు అందరిలో భక్తిని ప్రేరేపించింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేతంగా కొలువుదీరిన మల్లికార్జునుడి దర్శనంతో వేలాది మంది తన్మయత్వం పొందారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
– చేర్యాల, జనవరి 23
పట్నం వారం సందర్భంగా సోమవారం కొమురవెల్లి భక్తులతో పోటెత్తింది. భక్తులు చల్లుకున్న బండారితో స్వామి వారి సన్నిధి పసుపు వర్ణ శోభితమైంది. ఒగ్గు పూజారులు పంచవర్ణాల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం, అగ్నిగుండం వరకు తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. భక్తులు అగ్నిగుండాలను దాటే కార్యక్రమం అద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఆలయంలో మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మను దర్శించుకుని తరించారు.
– చేర్యాల, జనవరి 23
ఒళ్లంతా బండారు.. మనసంతా మల్లన్న…
భక్తులు పసుపును ఒళ్లంతా పూసుకోవడంతోపాటు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. బండారును ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మల్లన్నపై భక్తిప్రపత్తులను చాటారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో పాల్గొనేందుకు భక్తులు గంటల పాటు వేచి ఉన్నారు.
దర్శనం.. భక్తిపారవశ్యం…
అనంతరం పెద్దపట్నం, అగ్నిగుండాలను అర్చకులు దాటిన వెంటనే భక్తులు పట్నం, అగ్నిగుండాలను దాటుకుంటూ ఆలయంలో మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం శివసత్తులు, ఘనాచార్యులకు ఆలయ కమిటీ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో బాలాజీ, పాలకమండలి సభ్యులు కండువా, జాకెట్ ముక్కలతోపాటు స్వామివారి బండారి పంపిణీ చేశారు.
పంచవర్ణాలపెద్దపట్నం.. పంచ పల్లవాల అగ్నిగుండం
ఒగ్గు పూజారులు పంచవర్ణాలు (తెలుపు, పసుపు, నీలి, ఎరుపు, ఆకుపచ్చ) రంగు గల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలు (మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి) కట్టెలు పేర్చి అగ్నిగుండం తయారు చేశారు. అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పెద్దపట్నం, అగ్నిగుండం వరకు తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. భక్తులు అగ్నిగుండాలను దాటే కార్యక్రమం అద్యంతం ఉత్కంఠగా సాగింది. పట్నం వారానికి వచ్చిన భక్తులు శనివారం ధూళిదర్శనం, ఆదివారం బో నా లు, పట్నాలు, సోమవారం పెద్ద పట్నం, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించ డం ఇక్కడ ఆనవాయితీ. ఈ క్రమంలో పెద్ద పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
పోలీసుల భారీ బందోబస్తు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాయని అడిషనల్ డీసీపీ మహేందర్ తెలిపారు. ఆయన సోమవారం పోలీసు బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పెద్దపట్నం, అగ్నిగుండాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ అధికారులు, పాలక మండలి, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో స్వామివారి కార్యక్రమాలను విజయవంతం చేశామన్నారు. సహకరించిన భక్తులు, అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల పాటు విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్, ఎస్బీ ఏసీపీ రవీందర్ రాజు, ఇన్స్పెక్టర్ రఘుపతి, చేర్యాల సీఐ శ్రీనివాస్, హుస్నాబాద్ సీఐ కిరణ్, కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్, కోహెడ ఎస్సై నరేందర్రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.