చిట్యాల, ఏప్రిల్ 18 : తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాకే పనులు చేపట్టాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామ శివారు నుంచి వెళ్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే కోసం అధికారులు రైతుల భూములు సేకరించారు. అయితే పరిహారం చెల్లించకుండానే పనులు ప్రారంభించడంతో ఆగ్రహించిన బాధిత రైతులు అడ్డుకున్నారు.
భూమితో పాటు బోరు బావులు, పైపులు, విలువైన చెట్లకు పరిహారం అందించలేదని అక్కడికి చేరుకున్న తహసీల్దార్ వసంతరావుతో పాటు హైవే అధికారులను నిలదీశారు. అలాగే తాము పండిస్తున్న మిర్చి, మక్కజొన్న తదితర పంటలు చివరి దశకు చేరుకున్నాయని, వాటిని కోసేంత వరకు ఆగాలని వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న ఎస్సై సతీశ్తో పాటు పోలీసులు వారిని సముదాయించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తహసీల్దార్తో పాటు హైవే అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు దువ్వల సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, దువ్వల లక్ష్మి, నర్సయ్య, స్వప్న తదితరులు పాల్గొన్నారు.