వర్ధన్నపేట, సెప్టెంబర్ 13 : రైతులకు చేయూతనివ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రుణ మాఫీ అర్హులందరికీ అందేలా చూడాలని వరంగల్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు సూచించారు. వర్ధన్నపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా సహకార బ్యాంకు సమావేశం హాలులో వరంగల్ జోనల్ స్థాయి సహకార సంఘాల సొసైటీ చైర్మన్లు, బ్యాంకు అధికారులు, సీఈవోలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులకు చెందిన రూ.115 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. సొసైటీల వారీగా అర్హుడైన ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేలా చూడాలని సూచించారు. అంతేకాక అర్హులైన వారికి వెంటనే కొత్త రుణాలను కూడా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు రుణ మాఫీ, కొత్త రుణాల మంజూరు విషయంలో సొసైటీ సీఈవోలకు సహకారం అందించాలని ఆదేశించారు.
వ్యాపారాలపై దృష్టి సారించాలి..
ప్రాథమిక వ్యవసాయ సహకార, కర్షక సేవా రైతు సంఘాలు కేవలం రుణాలు ఇవ్వడం, వసూలు చేయడంతో పాటు ఆర్థికంగా బలోపేతం కావడంపై దృష్టి సారించాలని, వీలైన కేంద్రాల్లో వ్యాపారాలు చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. నందనం బ్యాంకు పరిధిలో ఐనవోలులో వ్యాపార సముదాయాన్ని ప్రారంభించినట్లు ఉదహరించారు. ఇదే తరహాలో ప్రజల అవసరాలను గుర్తించి వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం బ్యాంకు అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకారం అందించనున్నట్లు చెప్పారు. అన్ని సొసైటీలకు భవనాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సొసైటీల బాధ్యులు, పాలక మండలి సమావేశాలు ఏర్పాటు చేసుకొని భవనాల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు.
సొసైటీల వారీగా సమీక్ష..
జోనల్ పరిధిలోని తొర్రూరు, నెల్లికుదురు, రాయపర్తి, వర్ధన్నపేట, నందనం, కొలన్పల్లి తదితర సొసైటీల వారీగా చైర్మన్ రవీందర్రావు, జీఎం, సీఈవోలు సమీక్ష నిర్వహించారు. బ్యాంకు, సొసైటీల ద్వారా ఇచ్చిన రుణాలు, నెలవారీగా, పంట కాలాల వారీగా అవుతున్న రికవరీలపై చర్చించారు. లావాదేవీలు, ఖర్చుల వివరాలను తెలుసుకొన్నారు. రికార్డుల తయారీ, రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడితే సంబంధిత శాఖల సీవోలు, ఇతర అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రుణమాఫీపై నిర్లక్ష్యం వహించొద్దని, సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం పనిచేయాలన్నారు. సొసైటీ అకౌంట్స్ విషయంలో సీవోలు పారదర్శకంగా పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ చాపల యాదగిరిరావు, డీఆర్ఏవో వల్యానాయక్, సీఈవో చిన్నారావు, జీఎం శ్రీధర్, డీజీఎం కురువానాయక్, ఏజీఎం రాజశేఖర్, నోడల్ అధికారి భద్రునాయక్, బ్యాంకు మేనేజర్లు సమత, రమ్యశ్రీ, శ్రవణ్ పాల్గొన్నారు.