హనుమకొండ, ఫిబ్రవరి 25 : నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్)లో నకిలీ మెడికల్ బిల్లుల వ్యవహారం కలకలం రేపుతున్నది. రెండు రోజులుగా సంస్థ కార్యాలయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఒక అత్యున్నత స్థాయి అధికారే అక్రమాలకు పాల్పడడంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. సంస్థను కాపాడాల్సిన వారే అక్రమాలకు పాల్పడితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్న ఉన్నతస్థాయి అధికారి తన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్పత్రి నుంచి తీసుకున్న నకిలీ మెడికల్ బిల్లులతో రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసి క్లెయిమ్ చేసుకున్నట్లు రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది.
సదరు అధికారి గతంలో కామారెడ్డిలో డీఈగా పనిచేసిన సమయంలో కాంట్రాక్ట్ వర్క్ బిల్లులు టాంపరింగ్ చేసి ఎక్సెస్ చేసిన కేసు ఇప్పటికీ ఇంకా పెండింగ్లోనే ఉన్నట్లు సమాచారం. ఆ కేసు విచారణ పూర్తికాకముందే నకిలీ మెడికల్ బిల్లుల వ్యవహారం వెలుగులోకి రావడం సంస్థ ప్రతిష్టకు మచ్చతెచ్చేలా మారింది. త్వరలోనే ఉద్యోగ విరమణ పొందనున్న సమయంలో ఆ అధికారిపై ఆరోపణలు రావడం ఉద్యోగ వర్గాల్లో మరింత చర్చనీయాంశమైంది. కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడితే నియంత్రించాల్సిన వారే అక్రమాలకు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసులోని మెడికల్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు నకిలీ మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ విషయంలో సహకరిస్తున్నట్లు ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సెక్షన్లో క్షుణ్ణంగా పరిశీలిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈ విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో అప్రమత్తమై విచారణకు ఆదేశించినట్లు తెల్సింది. ఈ ఒక్క బిల్లే ఉందా? ఇంకా ఎక్కడైలా ఇలాంటి అక్రమాలు జరిగాయా? అనే కోణంలో కూపీ లాగుతున్నట్లు సమాచారం. నకిలీ మెడికల్ బిల్లుల విషయమై సీఎండీ వరుణ్రెడ్డిని ఫోన్లో సంప్రదించగా విచారణ అధికారిని నియమించామని, పూర్తి స్థాయి నివేదిక అందిన అనంతరం చర్యలుంటాయని తెలిపారు.