ముగ్గురి అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
నిందితుల్లో కరీంనగర్ జిల్లా వావిలాలకు చెందిన ఆశ వర్కర్
రూ.7.54 లక్షల ఫేక్ నోట్లు, రూ.లక్ష నగదు, కారు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం
టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్గైక్వాడ్ వివరాల వెల్లడి
సుబేదారి, జూన్ 23 : నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండ సుబేదారిలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో అదనపు డీసీపీ వైభవ్గైక్వాడ్ నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మారలపాడుకు చెందిన శేఖర్, ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన శ్రీకాంత్, భద్రాద్రికొత్త గూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన సోర్ల ప్రసాద్ కలిసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. పేపర్ నోట్లు కొనుగోలు చేసి నకిలీ కరెన్సీ తయారీ చేసి, ఒరిజినల్ కరెన్సీగా చలామణి చేయడానికి ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా వావిలాలకు చెందిన ఆశ వర్కర్ జనగామ భాగ్యలక్ష్మి, గోదావరిఖనికి చెందిన నల్లగోని రవీందర్గౌడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లకు చెందిన మల్లాగౌడ్ వ్యాపారంలో నష్టపోతున్నామని నకిలీ కరెన్సీతో డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈ మేరకు సోర్ల ప్రసాద్, శేఖర్, శ్రీకాంత్తో మాట్లాడి గురువారం వరంగల్ పెద్దమ్మగడ్డకు కారులో వచ్చారు. నిందితులు వారి నుంచి రూ.లక్ష ఒరిజినల్ కరెన్సీ తీసుకుని రూ.మూడు లక్షల నకిలీ కరెన్సీ ఇచ్చారు. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు పెద్దమ్మగడ్డ వద్ద సోర్ల ప్రసాద్, భాగ్యలక్ష్మి, రవీందర్గౌడ్ను పట్టుకున్నారు. శేఖర్, శ్రీకాంత్ పరారయ్యారు. కారులో తనిఖీ చేయగా నల్లటి కాగితాలు లభించాయి. అరెస్టు చేసిన ప్రసాద్, భాగ్య లక్ష్మి, రవీందర్గౌడ్ నుంచి రూ.7.54 లక్షల నకిలీ కరెన్సీ, కారు, ఐదు సెల్ఫోన్లు, రూ.లక్ష అసలు నగదు, పేపర్ బాండిల్స్ స్వాధీనం చేసుకున్నారు.