జనగామ, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును జనగామలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలిసిన పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు హుటాహుటిన అ క్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. చివరికి హైదరాబాద్కు పోతానంటే విడుదల చేస్తానని పోలీసులు అనడంతో సరేనన్న ఎర్రబెల్లిని పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు.
బంద్ చేసుకునే హక్కు లేదా : ఎర్రబెల్లి
తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని, ప్రజాస్వామ్యంలో బంద్ చేసుకునే హక్కు ప్రతిపక్షాలకు లేదా, ఎలా అడుగడుగునా అరెస్టులు చేస్తారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. మచ్చలేని నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని ఓ దాత ఇచ్చిన ప్రైవేట్ స్థలంలో పెడితే కూలగొడతారా, కొందరు అధికారులు తప్పు చేస్తుండ్రని, వాళ్లను వదలమన్నారు. రాబోయేది బీఆర్ఎస్ పాలనేనని, కేసీఆరే ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. నర్సంపేట బంద్ను విఫలం చేయడానికి అనేక మంది నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. అనేక దిగ్బంధాల మధ్య , పార్టీ శ్రేణులు, రాజకీయాలకతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున బంద్లో పాల్గొని సంపూర్ణ విజయవంతం చేశారన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఎర్రబెల్లి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడంలోనే నిమగ్నమయ్యాడని, వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని ఎర్రబెల్లి విమర్శించారు. రేవంత్రెడ్డి తమ్ముళ్లు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి భూకబ్జాలు పెరిగాయని, హైదరాబాద్లో ఎప్పుడు తమ ఇల్లు ఎప్పుడు కూలగొతారోనని యజమానులు ,భయంతో చస్తున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు కొందరు రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని, వారందరి భరతం పట్టడం ఖాయమని అన్నారు.