వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 21 : ఎంజీఎం హాస్పిటల్ను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం సందర్శించారు. సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్తో కలిసి నర్సింగ్ హాస్టల్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. సేవాభావంతో విధులు నిర్వర్తిస్తున్న నర్సింగ్ విద్యార్థులు, సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఎంజీఎం ఆవరణలో తొలగించిన చెట్ల స్థానంలో గార్డెనింగ్ చేయాలన్నారు. వార్డులను పరిశీలించి, శుభ్రతను మరింత పెంచాలని సూచించారు. మురుగునీటి పైప్లైన్, సెప్టిక్ ట్యాంక్, పార్కింగ్ సమస్యను సూపరింటెండెంట్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. వరంగల్ను హెల్త్ హబ్గా ప్రభుత్వం తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నదని, అందరూ సహకారం అందించాలని తద్వారా ప్రజలకు ప్రభుత్వ వైద్యసేవలు మరింత అందుబాటులోకి వస్తాయన్నారు. ఎంజీఎం ఆర్ఎంవోలు మురళి, దిలీప్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.