వరంగల్, ఫిబ్రవరి 1(నమస్తేతెలంగాణ) : రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నది. నేత్ర శిబిరాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వీరిలో పద్దెనిమిదేళ్లకు పైబడిన ప్రతి ఒక్కరికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం జిల్లాలోని 44 శిబిరాల్లో 6,845 మందికి పరీక్షలు జరిపారు. ఇప్పటివరకు 58,040 మంది కంటి పరీక్షలు పొందారు. వీరిలో 14,080 మంది రీడింగ్ కళ్లద్దాలను అందుకున్నారు. మరో 8,279 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ వెల్లడించారు. బుధవారం రెడ్యానాయక్తండా, ఇటికాలపల్లి, చంద్రయపల్లి, శంకరంతండా, ఉప్పరపల్లి, మల్లంపల్లి, గీసుగొండ, వంచనగిరి, లక్ష్మీపురం, ధర్మారావుపేట, ఖానాపురం, నారక్కపేట, నల్లబెల్లి, దీక్షకుంట, నెక్కొండ, హట్యాతండా, పర్వతగిరి, చింతనెక్కొండ, కొండాపూర్, కాశగూడెం, రాయపర్తి, గన్నారం, సంగెం, గవిచర్ల గ్రామాలు, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 21, 35, 26, 36, 22, 12, 37, 39, 15, 19, 16, 17, 3, 2, 42, 41, 39, 32వ వార్డులో 6,845 మందికి కంటి పరీక్షలు చేశారు. అత్యధికంగా సంగెం మండలం గవిచర్ల శిబిరంలో నిర్వహించారు. ఇక్కడ 249 మందికి కంటి పరీక్షలు జరిపారు. 192తో సంగెం శిబిరం రెండు, 188తో వరంగల్లోని 19వ వార్డు మూడో స్థానంలో నిలిచాయి. ఇటికాలపల్లిలో 185, పర్వతగిరిలో 183, వరంగల్లోని 16వ వార్డులో 176, హట్యాతండాలో 175, ఉప్పరపల్లిలో 174, ధర్మారావుపేటలో 172, వరంగల్లోని 15వ వార్డులోనూ 172, 36వ వార్డులో 169, కొండాపూర్లో 167, వరంగల్లోని మూడో వార్డులో 166, చింతనెక్కొండలో 165 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
పద్నాలుగు శిబిరాల్లో పూర్తి..
కంటివెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 44 బృందాలతో పనిదినాల్లో వందరోజుల్లో 408 నేత్ర శిబిరాలు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 14 శిబిరాల్లో కంటి పరీక్షల నిర్వహణ పూర్తయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. నెక్కొండ మండలం అలంకానిపేట, నర్సంపేట మండలంలోని బాంజీపేట గ్రామం, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం, దుగ్గొండి మండల కేంద్రం, కేశవపూర్, నల్లబెల్లి మండలం మేడపల్లి, పర్వతగిరి మండలం కొంకపాక, గీసుగొండ మండలం ఊకల్, వర్ధన్నపేట మండలం చెన్నారం, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు, రాయపర్తి మండలం తిర్మలాయపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన నేత్ర శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించడం పూర్తయినట్లు డీఎంహెచ్వో తెలిపారు. ఇక్కడి బృందాలు మరో పద్నాలుగు నేత్ర శిబిరాల్లో కంటి పరీక్షలు జరుపుతున్నట్లు చెప్పారు. డీఎంహెచ్వో బుధవారం జిల్లాలోని వివిధ నేత్ర శిబిరాలను సందర్శించి కంటి పరీక్షలు, మందులు, రీడింగ్ అద్దాల పంపిణీ, ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఆర్డర్ చేయడాన్ని క్షేత్రస్థాయిలో పరీశీలించారు. వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కళ్లు మంచిగ కనపడ్తానయ్..- ఎడ్ల భాగ్యలక్ష్మి, సంగెం
సంగెం, ఫిబ్రవరి 1 : మస్క మస్కగా కనపడే కళ్లు ఇప్పుడు అద్దాలు పెట్టుకుంటే మంచిగ కనపడ్తానయ్. ఊళ్లకు కండ్ల డాక్టర్లు వచ్చిండ్రని చెబితే పోయిన. కండ్లను పరీక్షించిండ్రు. సుక్కల మందు ఇచ్చిండ్రు. రోజు కండ్లల్లో వేసుకోవాలన్నరు. అట్లనే కళ్లద్దాలు ఇచ్చిండ్రు. ఆ అద్దాలు పెట్టుకుంటే మస్క మస్క పోయి కండ్లు తేజ్గా కనిపిస్తానయ్. కేసీఆర్ కడుపు సల్లగ ఉండ. మాలాంటోళ్లకు మంచి పని చేసిండు. కేసీఆర్ పదికాలాల పాటు రాష్ర్టాన్ని ఏలాలె.