న్యూశాయంపేట, మార్చి 21: బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ సమన్వయ కమిటీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పది గ్రామాలకు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలని, ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత మార్పు, చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. సమన్వయ కమిటీల ఆత్మీయ సమ్మేళనాల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నందున పార్టీ క్రియాశీల కార్యకర్తలు అందుబాటులో ఉండాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్లు బీఆర్ఎస్పై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. ఉద్యమకారులు, క్రియాశీల సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రతినిధులు ఆత్మీయ సమ్మేళనాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.