నగరంలో మైండ్ ట్రీ.. ప్రకటించిన కంపెనీ యాజమాన్యం
ఇప్పటికే టెక్ మహీంద్ర, సైయంట్ కార్యకలాపాలు
మడికొండ ఇండిస్ట్రియల్ ఏరియాలో విస్తరిస్తున్న ఐటీ హబ్
వరంగల్, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్న వరంగల్ మహా నగరానికి ఐటీ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మడికొండ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఐటీ హబ్లో పలు కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, మరిన్ని పెద్ద కంపెనీలు రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. టెక్ మహీంద్రా, సైయంట్, క్వాడ్రంట్ రిసోర్సెస్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు కొనసాగుతుండగా తాజాగా, దేశీయ ఐటీ సంస్థ మైండ్ ట్రీ వరంగల్లో అడుగుపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ విషయాన్ని మైండ్ ట్రీ సీఈవో దేబాషిశ్ చటర్జీ హైదరాబాద్లో గురువారం ప్రకటించారు. దీంతో జిల్లాలోని నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చారిత్రక వరంగల్ నగరానికి కొత్త బ్రాండ్ వస్తోంది. ఇప్పటికే ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్న నగరం ఐటీ సిటీగా మారుతోంది. దేశీయ, అంతర్జాతీయ ప్రసిద్ధ కంపెనీలు వరంగల్ నగరంలో తమ కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పెద్ద కంపెనీలు వరంగల్ వైపు చూస్తున్నాయి. తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరుగాలని, అందుకు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికకు అనుగుణంగా ఐటీ మంత్రి కేటీఆర్ ఆచరణతో పలు ప్రముఖ ఐటీ కంపెనీలు వరంగల్ నగరానికి వస్తున్నాయి. మడికొండలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఐటీ హబ్ వేగం గా విస్తరిస్తోంది. టెక్ మహీంద్రా, సైయంట్, క్వాడ్రంట్ రిసోర్సెస్ వంటి కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా, దేశీయ ఐటీ కంపెనీల్లో ప్రముఖ సంస్థ మైండ్ ట్రీ వరంగల్లో ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మైండ్ ట్రీ సీఈవో దేబాషిశ్ చట్టర్జీ హైదరాబాద్లో గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు.
ఐటీ రంగాన్ని హైదరాబాద్ తర్వాత రెండోశ్రేణి నగరాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా మైండ్ ట్రీ ఈ ప్రకటన చేసింది. ప్రముఖ ఐటీ కంపెనీ జెన్ ప్యాక్ట్ సైతం వరంగల్లో కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. జెన్ ప్యాక్ట్ సీఈవో టైగర్ త్యాగరాజన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విద్యా శ్రీనివాసన్, ఇండియా ఆపరేషన్స్ లీడర్ సతీశ్ వడ్లమాని తదితరుల బృందం గత నెలలో ఐటీ మంత్రి కే తారకరామారావుతో సమావేశమైంది. వరంగల్ కేంద్రంగా తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనుందని సమావేశం తర్వాత జెన్ప్యాక్ట్ సీఈవో త్యాగరాజన్ ప్రకటించారు. ఐటీ పరిశ్రమకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఐటీ కంపెనీలకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. హైదరాబాద్తో పోల్చితే కార్యాలయాల నిర్వహణ, మానవ వనరుల ఖర్చులు తక్కువగానే ఉండడంతో పలు కంపెనీలు వరంగల్ వంటి నగరాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నాయి.
కాజీపేట రైల్వే జంక్షన్, జాతీయ రహదారులతో వరంగల్ నగరంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థ ఉంది. వరంగల్-హైదరాబాద్ జాతీ య రహదారిలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఇప్పటికే ఐటీ హబ్ను నిర్మించింది. వరంగల్ నగరంలో ఐటీ రంగం విస్తరణ కోసం 2020 ఫిబ్రవరి 6న మంత్రి కేటీఆర్ వరంగల్లో సైయంట్ కంపెనీ ఇంక్యుబేషన్ సెంటర్, టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. సైయంట్ సొంత భవనాల్లోకి మారడంతో ప్రభుత్వ ఇంక్యుబేషన్ సెంటర్లో టెక్ మహీంద్రా తమ కార్యకలాపాలను మొదలుపెట్టింది. టెక్ మహీంద్రా సొంతంగా భవనాలను సమకూర్చునే పని లో నిమగ్నమైంది. క్వాడ్రెంట్ రిసోర్సెస్ కంపెనీ సైతం వరంగల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కంపెనీలకు ఎన్నో రకాల ప్రోత్సాహకాలు ఇస్తోంది.
వరంగల్ మహానగరానికి మొదట వచ్చే ఐటీ కంపెనీలకు మూడేండ్లపాటు మున్సిపల్ పన్నుల నుంచి మినహాయింపు అవకాశం ఉంది. ఐటీ ఈవెంట్ల నిర్వహణ ఖర్చులలో కొంత మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి యూనిట్కు రూపాయి చొప్పున కరెంటు బిల్లులను ప్రభుత్వం తిరిగి ఇస్తోంది. ఐటీ కంపెనీలకు అవసరమైన సిబ్బందిని సమకూర్చే ప్రక్రియలో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) తో శిక్షణ ఇప్పిస్తోంది. క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తే టాస్క్ నుంచి ప్రతి విద్యార్థికి రూ.20వేల వరకు ఇస్తోంది. 250కి పైగా ఐటీ ఉద్యోగాలు, 500కు పైగా ఐటీ ఆధారిత ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు ప్రభుత్వం రూ.10లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నది.