నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. అభ్యర్థుల నుంచి 10 వరకు స్వీకరణ, 13న పరిశీలన, 15న ఉప సంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వర్ధన్నపేట తహసీల్దార్, నర్సంపేట ఆర్డీవో, జీడబ్ల్యూఎంసీ, హనుమకొండ ఆర్వో ఆఫీసుల్లో సర్వం సిద్ధం చేశామని, అభ్యర్థి వెంట కార్యాలయంలోకి నలుగురికే ప్రవేశం ఉంటుందని రెండు జిల్లాల ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.
వరంగల్ (నమస్తేతెలంగాణ)హనుమకొండ, నవంబర్ 2 : నామినేషన్ల స్వీకరణకు వరంగల్, హనుమకొండ ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆయా శాసనసభ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయం వద్ద బారికేడ్లు, పోలీసు బందోబస్తు, మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే పదకొండు గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 10వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. అభ్యర్థుల నుంచి అధికారులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వాటిని ఈ నెల 13న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 15న ముగియనుంది. వర్ధన్నపేట నియోజకవర్గానికి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నర్సంపేటకు ఆర్డీవో కే కృష్ణవేణి, వరంగల్తూర్పు నియోజకవర్గానికి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్బాషా, హనుమకొండకు ఆర్డీవో రమేశ్, పరకాలకు ఆర్డీవో కే శ్రీనివాస్ ఆర్వోలుగా వ్యవహరిస్తున్నారు. వర్ధన్నపేటలోని తాసిల్దార్, నర్సంపేటలో ఆర్డీవో, జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో వరంగల్తూర్పు నియోజకవర్గం, హనుమకొండ రెవెన్యూ డివిజనల్, పరకాల ఆర్డీవో కార్యాల యంలో ఆర్వో కార్యాలయాలు పనిచేస్తున్నాయి.
నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి తన వెంట నలుగురితో మాత్రమే ఆర్వో కార్యాలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. అభ్యర్థులు తమ నామినేషన్లను సులువుగా సమర్పించేందుకు వీలుగా ఆర్వో కార్యాలయాల వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి నామినేషన్ల దాఖలు ఘట్టం మొదలు కానుండడంతో గురువారం ఆర్వో కార్యాలయాల్లో మాక్ నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. కాగా, నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను ఆయా నియోజకవర్గం ఆర్వో, పోలీసు ఉన్నతాధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 483 పోలింగ్ కేంద్రాలుండగా, 4,94,179 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,43,590 మంది పురుషులు, 2,50,577 మంది మహిళలు, 12 థర్డ్ జెండర్స్ ఉన్నారు. కాగా పరకాల నియోజక వర్గంలో 239 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 2,17,054 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,06,451 మంది పురుషులు, 1,10,601 మంది మహిళలు, ఇద్దరు థర్డ్ జెండర్లు ఉన్నారు.