వరంగల్ జిల్లాలో మంగళవారం నిర్వహించనున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలకు సర్వం సిద్ధం చేశారు. వరంగల్ ఓసిటీలో వరంగల్ తూర్పు, వర్ధన్నపేటలోని లక్ష్మీ గార్డెన్లో వర్ధన్నపేట, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నర్సంపేట నియోజకవర్గస్థాయి సభలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతినిధుల సభల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. విజయవంతం చేసేందుకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. సభల సందర్భంగా నియోజకవర్గ కేంద్రాలు గులాబీ జెండాలు, స్వాగత తోరణాలు, నేతల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయమయ్యాయి.
-వరంగల్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ)
వరంగల్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ జెండా పండుగ, నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సభలను పురస్కరించుకుని వాడవాడనా పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ జెండాల ఆవిష్కరణ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు జెండా గద్దెలను సిద్ధం చేశారు. గతంలో నిర్మించిన జెండా గద్దెలకు గులాబీ రంగు వేసి అలంకరించారు. కొత్తగా అనేక జెండా గద్దెలను నిర్మించారు. మంగళవారం ఉదయం సంబురంగా జెండా పండుగ జరుపుకొని నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సభకు తరలివెళ్లేందుకు సన్నద్ధం అయ్యారు. ప్రతినిధుల సభ కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో సకల ఏర్పాట్లు జరిగాయి. పార్టీ జెండాలు, స్వాగత తోరణాలతో ఆయా నియోజకవర్గ కేంద్రం గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధిష్ఠానం మంగళవారం జెండా పండుగ, నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సభల నిర్వహణకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదివారం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభల నిర్వహణపై ఆయన సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రతినిధుల సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, తొలిసారి నియోజకవర్గ స్థాయిలో జరుగనున్న ప్రతినిధుల సభలు వచ్చే ఎన్నికలకు శంఖారావం లాంటివని కేటీఆర్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ తొమ్మిదేండ్ల ప్రభుత్వ ప్రస్థానాన్ని ప్రజలకు మరోసారి వివరించేందుకు, పార్టీ క్యాడర్ను ఎన్నికలకు అన్నివిధాలుగా కార్యోన్ముఖులను చేసేందుకు ఈ సభలు ఎంతగానో దోహదపడుతాయని వివరించారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, తొమ్మిదేండ్ల తెలంగాణ రాష్ట్ర ఉజ్వల ప్రయాణాన్ని సభల్లో సమగ్రంగా చర్చించేలా ప్రసంగాలు, రాజకీయ తీర్మానాలు ఉండాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. తమ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం పార్టీ ప్లీనరీ నిర్వహణ కోసం కొద్ది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేపట్టారు. వరంగల్లోని ఓసిటీలో వరంగల్ తూర్పు, వర్ధన్నపేటలోని లక్ష్మీ గార్డెన్లో వర్ధన్నపేట, నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నర్సంపేట నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు జరుగనున్నాయి. వర్ధన్నపేట సభకు నియోజకవర్గం నుంచి నాలుగు వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఆది, సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట సందర్శించి ప్రతినిధుల సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సభకు హాజరయ్యే ప్రతినిధులకు భోజన వసతిపై తమ పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ఆయన వెంట డీసీసీబీ అధ్యక్షుడు మార్నేరి రవీందర్రావుతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఉన్నారు. ఆదివారం వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా వర్ధన్నపేట చేరుకొని ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. వరంగల్తూర్పు నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభకు ఆరు వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారని స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రకటించారు. ఓసిటీలో ప్రతినిధుల సభ జరిగే స్థలంలో చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే నరేందర్ స్వయంగా పరిశీలించారు. ఆకర్షణీయంగా సభ వేదికను తీర్చిదిద్దుతున్నారు. నర్సంపేట ప్లీనరీకి నియోజకవర్గం నుంచి 6 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వెల్లడించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సభకు నిర్ణీత సమయానికి చేరుకోవాలని ఆయన తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నర్సంపేట ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు పార్టీ నేతలు ఎంట్రీ పాసులను జారీ చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆది, సోమవారం ప్లీనరీ స్థలం వద్దే ఉండి స్వ యంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతినిధుల సభల సక్సెస్ కోసం ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్ తమ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనేతలతో ముందుగానే సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. ప్రతినిధుల సభ నిర్వహణలో పలువురికి బాధ్యతలు అప్పగించారు.
గులాబీమయమైన పట్టణాలు..
బీఆర్ఎస్ ప్రతినిధుల సభల సందర్భంగా నియోజకవర్గ కేంద్రాలు గులాబీ జెండాలు, స్వాగత తోరణాలు, నేతల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయమయ్యాయి. నగరంతో పాటు నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో రహదారులు, జంక్షన్లు, కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. రహదారుల పొడవున, ప్రతినిధుల సభ స్థలి వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలు, కటౌట్లతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఫొటోతో ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రతినిధుల సభల్లో ఎమ్మెల్యేలు కీలక ప్రసంగం చేస్తారు. అనంతరం సాయంత్రం వరకు సభలో ప్రసంగించే పార్టీ నేతల పేర్లను కూడా ఆయా ఎమ్మెల్యే ఇప్పటికే ఖరారు చేశారు. వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, నర్సంపేట సభలకు హాజరయ్యే ప్రతినిధులకు భోజనాలతో పాటు స్నాక్స్ను ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటల్లోగా జెండా పండుగ జరుపుకొని, పార్టీ జెండాలను ఆవిష్కరించిన తర్వాత సంబురంగా నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభకు బయల్దేరాలని ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభలు పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపనున్నాయి.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సభల్లో ఎమ్మెల్యేలు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. కనీసం ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టాలని కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు ప్రతినిధుల సభల్లో తీర్మానాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, విద్య, ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. వీటితో పాటు వివిధ అంశాలపై సమయాన్ని బట్టి తీర్మానాలు చేయడానికి, వ్యవసాయరంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి అసాధారణమైనదని, యావత్ దేశానికే ఇది ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని తీర్మానాల్లో ప్రస్తావించనున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఈ సభల ద్వారా బలమైన పునాది వేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కార్యకర్తలకు భరోసా వంటి అనేక అంశాలపై మొత్తం 15 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది చెప్పారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది.