రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వారాజు సారయ్యతో కలిసి ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అహర్నిషలు కష్టపడ్డానన్నారు. దీనిని నిరంతరం కొనసాగించాలంటే తనను మరో సారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్, బీజేపీ పాలనలో వెనుకబాటు తనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కార్యకర్తలు వివరించాలన్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి సారయ్య మాట్లాడుతూ ప్రజా సేవే లక్ష్యంగా పని చేసే గండ్రను ప్రతి కార్యకర్త ప్రాణంగా కాపాడుకోవాలన్నారు.
టేకుమట్ల, అక్టోబర్ 20 : నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు కష్టపడ్డానని, చేసిన పనిని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం మండలంలోని ఎంపేడు, వెల్లంపల్లి, దుబ్యాల, మందలోరిపల్లి, కుందనపల్లి, బండపల్లి, గుమ్మడవెల్లి, ఆరెపల్లి, రాఘవారెడ్డి, సుబ్బక్కపల్లి, అంకుషాపూర్, సోమనపల్లి, టేకుమట్ల గ్రామాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాకముందు గ్రామాల్లో పరిస్థితి, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఎలా లబ్ధి పొందారో కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. అవసరం అయితే లబ్ధిదారుల వాయిస్ ప్రజలకు చేరేలా ప్రచారం చేయాలన్నారు. మాయమాటలు చెప్పి, సెంటిమెంట్లతో గారడీ చేసే వారి మాయలో పడితే నియోజకవర్గం ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ఒక పక్క, వరద విపత్తులు మరో పక్క గోస పెట్టి బీభత్సం సృష్టించినా ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యలను పరిష్కరించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వరదతో చలివాగు వంతెన తెగి టేకుమట్ల మండలం రెండు గా విడిపోయిందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు గోసపడితే, ప్రత్యేక నిధులతో తాత్కాలిక వంతెన నిర్మించి నేటిని నుంచి రాకపోకలు పునరుద్ధరించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రతిఒక్కరికీ వివరించాలన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్, బీజేపీ పాలనలో జరిగిన వెనుకబాటు తనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే వారికి కండువాకప్పి ఆహ్వానించారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజా సేవ చేసే గండ్ర వెంకట రమణారెడ్డి గెలిపించి ప్రతి కార్యకర్త ఆయనను ప్రాణంగా కాపాడుకోవాలని భూపాలపల్లి ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. రాఘవరెడ్డిపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉంటూ, నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడంలో సఫలమయ్యారన్నారు. గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రచారం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షకార్యదర్శులు సట్ల రవి, తిరుపతి, సర్పంచులు కొలిపాక రాజయ్య, వనమ్మ, రాజేందర్, ఉమేందర్రావు, నర్సింహారెడ్డి, కోమల, మధుర, సంధ్య, సుజాత, శ్రీను, మహేష్, సరోత్తంరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, రఘు, రామారావు, మహిపాల్రెడ్డి, మహేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
రైలు ప్రమాదంలో నా రెండు కాల్లు కోల్పోయి మంచానికే పరితమయ్యాను. నాకు ఇక జీవితంలేదని మానసికంగా కుంగిపోయేది. ప్రభుత్వం ఇచ్చే దివ్యాంగుల పింఛన్, త్రీ వీలర్ ఇచ్చి నాకు ఎమ్మెల్యే గండ్ర కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. నా జీవితం ఉన్నంత వరకు ఆయనను మర్చిపోను. ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. పని చేసే వారిని గుర్తించి అండగా ఉండాలి. తప్పకుండా ఫలితం పొందుతాం. మన తీర్పే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.