పోషకాలు మెండుగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలుచేసేవి చిరుధాన్యాలు. వీటిని ఆహారంగా తీసుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుండడంతో పంటలకూ మాంచి డిమాండ్ ఏర్పడింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడితో ఆశించిన లాభాలు తెచ్చిపెడుతుండడంతో రైతాంగం సాగుకు మొగ్గు చూపుతోంది. అధికారుల ప్రోత్సాహం, వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నాలుగు మండలాల్లో ఈ యాసంగి సీజన్లో 310 ఎకరాల్లో రాగులు, సామలు, కొర్రలు, తెల్లజొన్న సాగవుతోంది. వీటిని ప్రాసెసింగ్ చేసేందుకు గణపురం మండలం చెల్పూర్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటుచేసింది.
– జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ)
యాసంగిలో 310 ఎకరాల్లో సాగు..
ఈ యాసంగి సీజన్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రోత్సాహంతో 310 ఎకరాల్లో రైతులు చిరుధాన్యాల పంటను సాగు చేశారు. కాటారం మండలంలోని దేవరాంపల్లి, శంకరాంపల్లి, జాదురావుపల్లి, రఘుపల్లి, వీరాపూర్, ధన్వాడ, చింతకాని, నస్తూర్పల్లి, పోతుల్వాయి గ్రామాల్లో మొత్తం 17మంది రైతులు 50 ఎకరాల్లో తెల్లజొన్న సాగు చేశారు. మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం, కనుకునూరు, నిమ్మగూడెం, పెగడపల్లి, సింగంపల్లి, సింగారం, యత్నారం గ్రామాల్లో 27మంది రైతులు 48 ఎకరాల్లో చిరు ధాన్యాలను సాగు చేశారు. ఇందులో 42 ఎకరాల్లో తెల్లజొన్న, ఐదెకరాల్లో రాగులు, ఎకరంలో కొర్రలు సాగుచేశారు. పలిమెల మండలంలో కామన్పల్లి, దమ్మూరు, ముకునూరు, నీలంపల్లి, పలిమెల, తిమ్మేటిగూడెం గ్రామాల్లో 120మంది రైతులు 167 ఎకరాల్లో తెల్లజొన్న, 7 ఎకరాల్లో రాగులు, 8 ఎకరాల్లో కొర్రలు సాగు చేశారు. మల్హర్ మండలంలోని నాచారం గ్రామంలో మొత్తం 14 మంది రైతులు మొత్తం 29 ఎకరాల్లో చిరుధాన్యాలను సాగు చేశారు. ఇందులో 26 ఎకరాల్లో తెల్లజొన్న, 2 ఎకరాల్లో రాగులు, ఒక ఎకరంలో కొర్రలు వేశారు. వానకాలంలో జిల్లాలో 501 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేశారు. కాటారం మండలంలోని 13 గ్రామాల్లో 36మంది రైతులు మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేశారు. అలాగే మహాముత్తారం మండలంలో 9 గ్రామాల్లో 175మంది రైతులు 221 ఎకరాల విస్తీర్ణంలో పంటను సాగు చేశారు. మల్హర్ మండలంలో నాచారం, అన్సాన్పల్లి గ్రామాల్లో 112మంది రైతులు మొత్తం 148 ఎకరాల్లో సాగుచేశారు. పలిమెల మండలంలో 138 మంది రైతులు 91 ఎకరాల్లో తెల్లజొన్నలు, రాగులు, కొర్రలు, సామలు సాగు చేశారు.
చీడపీడలూ తక్కువే..
మిగతా వాణిజ్య పంటలైన పత్తి, మిరప, అదేవిధంగా వరి పంటకు చీడపీడల బాధ ఎక్కువగానే ఉంటుంది. పురుగు మందులు ఎరువుల రూపేనా అధిక పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి సాగుచేస్తే పంటలు చేతికి వస్తాయో రావో అనే బెంగ రైతుల్లో ఉంటుంది. అదే చిరుధాన్యాల సాగు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభసాటిగా ఉంటుంది. చిరుధాన్యాల సాగుకు పెద్దగా సాగునీటి అవసరం ఉండదు. అలాగే చీడపీడల బాధ కూడా తక్కువే. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాలుగు మండలాల్లో చిరుధాన్యాల పంట వేసేందుకు రైతులు మొగ్గు చూపారు.
చెల్పూర్లో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్
జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్లో ప్రభుత్వం రూ.10 లక్షలు వెచ్చించి మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఇందులో తయారు చేసిన పౌష్టికాహార పదార్థాలను జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థుల్లో రక్తహీనత, అధిక బరువు, ఎత్తు సరిగా లేకపోవడం వంటి సమస్యల పరిష్కారాలకు సైతం దోహదపడనున్నది. ఈ యూనిట్ను ప్రారంభించాల్సి ఉంది.
ఒక పూట అంబలి తాగి జొన్న గడుక తింటం
మాకు నాలుగెకరాల చెలుక ఉంది. ఎకరం చెలుకలో తెల్లజొన్న ఏసినం. అండ్లనే బబ్బెర్లు, పెసళ్లు కూడా ఏసినం. పెట్టుబడి పైసలు పెద్దగా అక్కెరపడవు. మేము ఏడాదంతా ఒక పూట అంబలి తాగి, జొన్న గడుక తింటం. మరో పూట వరి అన్నం తింటం. మేము తినంగపోను మిగిలిన జొన్నలను అమ్మితే ఐదారు వేలు వత్తయ్. తెల్లజొన్న చేనుకు పురుగు మందులు కొట్టుడు అక్కర్లేదు. మందు బత్తాలు(ఎరువులు) తెచ్చే పని ఉండదు. విత్తనాలు మాకు వాళ్లు (వాసన్ స్వచ్ఛంద సంస్థ) ఉచితంగానే ఇచ్చిండ్రు. ఈ తెల్లజొన్న పంట ఏత్తె మంచిగనే లాభం అనిపిత్తాంది. మిగతా మూడెకరాల్లో పెసళ్లు, బబ్బెర్లు, మినుములు, వడ్లు పండిత్తాం.
– వాసం రమాదేవి, కామన్పల్లి, పలిమెల మండలం
పత్తి చేనేసి నష్టపోయిన
నాకు రెండెకరాల పది గుంటల భూమి ఉంది. ఎకరం చెల్కలో తెల్లజొన్న పంట ఏసిన. ఇక్కడ నీళ్ల వసతి లేదు. ఆకసాయి(వానకాలం) కింద పత్తిపంట ఏసిన. నీళ్లు లేకపోయేసరికి పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టపోయా. ఏడాది కిందటి నుండి తెల్లజొన్న పంట పండిత్తున్న. పోయినసారి 20 గుంటల చెల్కలో తెల్జొన్న ఏసిన. 32 కుంచాలు ఎల్లినయి. కుంచానికి 600 రూపాల చొప్పున అమ్మిన. 20 వేల రూపాయల వరకు వచ్చినయి. ఇప్పుడేసిన ఎకరం తెల్జొన్నకు కూడా పెట్టుబడి ఏమి పెట్టలేదు. చేను మంచిగనే ఉంది. ఇంకో నెలరోజుల్లో పంట చేతికత్తది.
– ఎన్క లక్ష్మయ్య, కనుకునూరు, మహాముత్తారం మండలం