నల్లబెల్లి, ఏప్రిల్ 14: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని డీబీఎం-38 ఎస్సారెస్పీ 17ఎల్ ఉపకాల్వను ఓ రైతు పూడ్చేసి వ్యవసాయ భూమిగా మార్చుకుంటున్నాడు. ఈ మండలంలో సాగునీటి కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఎస్సారెస్పీ ఎడమ కాల్వను నిర్మించింది. ఇదే కెనాల్ ద్వారా అనేక నింపేందుకు 17ఎల్, 11ఆర్ ఉపకాల్వలను నిర్మించింది. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాటు కెనాళ్లు, ఉపకాల్వల ద్వారా పంటలకు సాగునీరు సమృద్ధిగా సరఫరా చేసిన విషయం విదితమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల నుంచి సాగునీరు అందడం లేదు. దీంతో రంగాయచెరువు కెనాళ్లు, ఉపకాల్వలతో పాటు ఎస్సారెస్పీ డీబీఎం-38 17ఎల్, 11ఆర్ ఉపకాల్వలను కొందరు పూడ్చేసి వ్యవసాయ భూములుగా మార్చుకుంటున్నారు. లెంకలపల్లి శివారు కుమ్మరిమడుగు సమీపంలో రైతు పేరాల పెద్ద రాజు, మరికొందరు రైతులు జేసీబీతో 17ఎల్ ఉపకాల్వపై ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన కల్వర్టు, సీసీని ధ్వంసం చేశారు.
కాల్వలో వేసేందుకు సిమెంట్ పైపులు తెప్పించారు. దీంతో ఆయకట్టు రైతులు బత్తిని రవి, నానెబోయిన కుమారస్వామి, పిట్టల రాజు, మంద రాజు, నర్సయ్య, రామన్న, గుండెకారి చందర్, కిషన్, మేకల పైడి, ముప్పారపు రాజయ్య, పలువురు రైతులు ఆందోళన చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఎస్సారెస్పీతో పాటు రంగాయచెరువు ఉపకాల్వలు భవిష్యత్తులో అంతరించిపోయే ట్పమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇరిగేషన్ శాఖ డీఈ వివరణ కోరగా కాల్వ పూడ్చివేసిన రైతులపై చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.