బయ్యారం, ఆగస్టు 14: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీనివాస నగర్లో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు చేపట్టే ఈ పండుగ చివరి రోజు వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, సేవాలాల్ సేన రాష్ట్ర వ్యవస్థాపకుడు సంజీవ్ నాయక్ పాల్గొన్నారు. తొలుత శివపార్వతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీజ్ బుట్టలను గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. ఈ క్రమంలోనే మహిళలతో కలసి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్ సైతం సంప్రదాయ గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. తదనంతరం బుట్టలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన ప్రజల బతుకమ్మగా పేరుగాంచిన తీజ్ పండుగను సోదరులు ఐఖ్యతతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పెళ్లి కాని యువతులు మంచి భవిష్యత్ లభించాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆరాద్య దైవాలైన శీత్లాదేవి, మేరియా మాతలను ఆరాధిస్తూ పండుగను జరుపుకోవడం అనవాయితీగా వస్తున్నదన్నారు. ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంప్రదాయాలను గుర్తించి వారి పండుగలకు ప్రాముఖ్యత కల్పిస్తున్నారని గుర్తుచేశారు. తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన తర్వాత వాటి రూపు రేఖలు మారాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, ఎంపీపీ మౌనిక, వైస్ ఎంపీపీ గణేశ్, సొసైటీ చైర్మన్ మూల మధుకర్రెడ్డి, సర్పంచ్ కోటమ్మ, ఎంపీటీసీ కుమారి, శైలజారెడ్డి, టీటీఎఫ్ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్నాయక్, కిషన్నాయక్, తీజ్ కమిటీ బాబు, రవి, రూప్లా, శ్రీను, కోటి, కిషన్, రమేశ్, రవి, రామరావు పాల్గొన్నారు.
చిన్న కిష్టాపురంలో..
గార్ల: మండలంలోని చిన్నకిష్టాపురం గ్రామంలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గంగావత్ రుక్మిణీ మాట్లాడుతూ.. తీజ్ పండుగ బతుకమ్మను పోలి ఉంటుందని, ఎనిమిది రోజులపాటు పూజించి, తొమ్మిదో రోజు నిమజ్జనం చేస్తారన్నారు. కార్యక్రమంలో గంగావత్ హచ్యానాయక్, రాములు నాయక్, హరికిషన్, అశోక్, శ్రీనివాస్, బీమ్లానాయక్ పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్: మండలంలోని కొమ్ముగూడెం, రేగడితండా, అమనగల్ జీపీల్లో ఆదివారం రాత్రి తీజ్ వేడుకలు నిర్వహించారు. తండావాసులు తీజ్ బుట్టలను పట్టుకొని సంప్రదాయ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో కొమ్ముగూడెం టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జీ సిరినాయక్, బాలాజీనాయక్, వెంకన్న, భద్రు, హచ్యనాయక్, సురేశ్ పాల్గొన్నారు.