ఏటూరునాగారం, ఏప్రిల్ 11 : అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ మాలోత్ కవిత అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. గురువారం ఏటూరునాగారంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చి, వంద రోజుల్లోనే నెరవేర్చుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 120 రోజులైనా ఏ ఒక్క పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటుతోపాటు పుష్కలంగా సాగు నీళ్లు ఉండడంతో ఎక్కడా ఎకరం పంట కూడా ఎండిపోలేదని, ఒక్క రైతు కూడా చనిపోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుబంధు అందక చాలామంది అప్పుల పాలయ్యారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు చనిపోయిన 10 రోజుల్లో ఆ కుటుంబానికి రైతుబీమా కింద రూ.5 లక్షలు అందేవని, కాంగ్రెస్ ప్రభుత్వం బీమా సొమ్ము చెల్లించకపోవడంతో 200 రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఉన్నా లేకున్నా కేసీఆర్ వెంటే ఉంటామన్నారు. ప్రాణం పోయినా పార్టీ కండువా వదిలేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముందుగా గెలిచే సీటు మహబూబాబాద్ స్థానమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి కాంగ్రెస్కు ఓటేశామని గ్రామాల్లో అనుకుంటున్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధు పెంపు, మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు రూ.2500 ఇస్తామన్నారు.. ఇప్పటివరకు ఎందుకు చేయలేదని నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని, మనోధైర్యంతో ఉండాలని కోరారు. ములుగు జిల్లాకు మెడికల్ కళాశాల, ఏరియా వైద్యశాలను ఇవ్వడంతోపాటు జిల్లా కేంద్రంగా ప్రకటించిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, డిక్లరేషన్ల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలపై గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలన్నారు. కల్యాణలక్ష్మికి అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలన్నా ఢిల్లీకి కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని చెలాయిస్తున్నారని, రెండు రోజుల క్రితం ఆ పార్టీ నాయకుడు ములుగు ఏరియా వైద్యశాల సూపరిండెంటెంట్ను బూతులు తిట్టాడని, ఆ వైద్యుడు కరోనా సమయంలో అనేక సేవలు అందించారని అన్నారు. ఏటూరునాగారానికి వరదలొస్తే స్వయంగా ఇక్కడికి ముఖ్యమంత్రి వచ్చి గోదావరి కరకట్టకు నిధులు మంజూరు చేశారని వివరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు కూనూరు మహేశ్, సప్పిడి రాంనర్సయ్య కార్యకర్తల మనోవేదనను వివరించారు. పార్టీ అండగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ అంతటి విజయ, జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, మండల అధ్యక్షుడు గడదా సునీల్కుమార్, నాయకులు గోవిందనాయక్, తుమ్మ మల్లారెడ్డి, సంజీవరెడ్డి, ఈసం రామ్మూర్తి, తాటి కృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్, దుర్గం రమణయ్య, మాదిరి రామయ్య, కాకులమర్రి ప్రదీప్రావు, ఎజాజ్, కాళ్ల రామకృష్ణ, తూరం పద్మ, ఈసం రామ్మూర్తి, అల్లి శ్రీనివాస్, చంద్రబాబు, కోటేశ్వర్రావు, పూజరి సురేశ్, ఎమ్డీ సలీం పాషా, ఖాజాపాషా, తాడూరి రఘు, మెరుగువెంకటేశ్వర్లు, కాకా వెంకటేశ్వర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.