నర్సంపేట, జనవరి 20 : రైతులకు సబ్సిడీపై విద్యుత్ మోటర్లను పంపిణీ చేయనున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదట నర్సంపేట నియోజకవర్గంలో సబ్సిడీపై విద్యుత్ మోటర్ల పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో కేవలం ఈ నియోజకవర్గంలో మాత్రమే ఈ పథకం అమలు అవుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందు కోసం రూ. 3.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతులు దగ్గర్లోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాలను ఉద్యాన శాఖ అధికారులకు సమర్పించాలన్నారు. రైతులకు తప్పనిసరిగా బోరు, బావి ఉండాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.