గిర్మాజీపేట, మార్చి 18 : వచ్చే పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. ఈమేరకు సోమవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీపీ అంబర్కిషోర్ఝా, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి కలెక్టర్లు సిక్తా పట్నాయక్, షేక్ రిజ్వానా బాషా, భవేశ్మిశ్రా, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ఖరే, డీసీపీలతో కలిసి పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న 1,899 పోలింగ్ కేంద్రాల్లో 419 కేంద్రాలు సమస్యాత్మకమైనవని గుర్తించామని తెలిపారు. ఆయాచోట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రోజువారీ నివేదికలను ఎలాంటి తప్పుల్లేకుండా సకాలంలో పంపాలని సూచించారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు సమష్టిగా కృషిచేయాలని సీపీ అంబర్ కిషోర్ఝూ అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత సమర్థవంతంగా పనిచేయాలని చెప్పారు. చెక్పోస్టుల వద్ద అప్రతమ్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలుచేస్తూ, ఉల్లంఘనలు జరుగకుండా చూడాలన్నారు. నేటినుంచే ఎఫ్ఎస్టీఎస్, ఎస్టీ బృందాలు, చెక్పోస్టులు పనిచేయాలన్నారు. భూపాలపల్లి కలెక్టర్ భవేశ్మిశ్రా మాట్లాడుతూ ఈసీఐ నిబంధనల ప్రకారం నియోజకవర్గంలో పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకే పూర్తవుతుందని, సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జనగామ కలెక్టర్ షేక్ రిజ్వానాబాషా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణను బాధ్యతతో సమర్థవంతంగా చేపట్టాలని, రోజువారీ నివేదికలు తప్పనిసరిగా అందించాలన్నారు. సమావేశంలో ఏఆర్వోలు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్, డీఎస్ వెంకన్న, రోహిత్సింగ్, నారాయణ, వెంకటయ్య, మంగీలాల్, సీదం దత్తు, రాధికాగుప్తా, వైవీ గణేశ్, ఉప ఎన్నికల అధికారులు పీయూష్కుమార్, సంధ్యారాణి, కే వెంకటేశ్వర్లు, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూ.లక్షకు పైగా బ్యాంక్ లావాదేవీల వివరాలు సమర్పించాలని జిల్లా ఉప ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలోని బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని బ్యాంకు అధికారులకు సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలీ రాజు పాల్గొన్నారు.