వరంగల్, సెప్టెంబర్ 25 : నగరంలోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజూ గ్రేటర్ పరిధిలో సుమారు 420 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పతి అవుతోంది. దాన్ని ప్రణాళికాబద్ధంగా డంపింగ్ యార్డును తలించేందుకు బల్దియా అధికారులు చర్యలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా గ్రేటర్లో రెండు ప్రాంతాల్లో సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్లను ఏర్పా టు చేస్తున్నారు.
వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఈ మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి కోజ్డ్ కంపాక్టర్ల ద్వారా రాంపూర్ డంపింగ్ యార్డ్కు చెత్తను తరలించనున్నారు. సుమారు రూ.7.5 కోట్లతో చేపట్టిన ఈ రెండు సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వీటిని ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా పలుమార్లు పనులను పరిశీలించి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
రూ.7.5 కోట్లతో మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్లు..
గ్రేటర్లో రూ.7.5 కోట్ల నిధులతో బాలసముద్రం, పోతననగర్లో రెండు మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆరు క్లోజ్డ్ కంపాక్టర్లు కొనుగోలు చేశా రు. మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్ల సివిల్ వర్క్ పనులు తుది దశలో ఉన్నాయి. గ్రేటర్లోని 355 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇక్కడి చెత్తను నేరుగా క్లోజ్డ్ కంపాక్టర్లలోకి డంపింగ్ చేస్తారు. దానికి సంబంధించిన పరికరాల ఫిట్టింగ్ పూర్తయింది. వరంగల్ ప్రాంతంలోని స్వచ్ఛ ఆటోలు పోతన నగర్ మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్, హనుమకొండ ప్రాంతంలోని స్వచ్ఛ ఆటోలు బాలసముద్రంలోని ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి చెత్తను డంపింగ్ చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
క్లోజ్డ్ కంపాక్టర్ల ద్వారా తరలింపు..
కొత్తగా రూ.6 కోట్లతో కొనుగోలు చేసిన క్లోజ్డ్ కంపాక్టర్ల ద్వారా మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి చెత్తను నేరుగా రాంపూర్లోని డంపింగ్ యార్డుకు చేరవేయనున్నారు. గతంలో స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యా ర్డుకు చెత్త తరలించేవారు. ఈ క్రమంలో రోడ్లపై చెత్త పడుతుండడంలో పలు ఫిర్యాదులు వచ్చేవి. ఈ నేపథ్యంలో కొత్తగా 6 క్లోజ్డ్ కంపాక్టర్లు కొనుగోలు చేశారు. పోతన స్టేషన్లో 3, బాలసముద్రం స్టేషన్కు 3 కేటాయించారు. దీంతో ఈ స్టేషన్ల ఏర్పాటుతో స్వచ్ఛ ఆటోలు రెండు, మూడు ట్రిప్పులు చెత్త సేకరించే అవకాశం ఉంటుంది. ఇకపై చెత్త డంపింగ్ కూడా సులువు కానుంది.