కాజీపేట, డిసెంబర్ 12: రాష్ట్రంలోని ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీ) సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్హాల్లో ఆదివారం దివ్యాంగ పిల్లలకు విద్యా సౌకర్యం-ఐఈఆర్పీ పాత్ర అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. పీఆర్టీయూ టీఎస్, ఐఈఆర్పీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిలివేరి వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఐఈఆర్పీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దివ్యాంగ పిల్లలకు విద్యనందిస్తున్న ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. దివ్యాంగుల విద్యాభివృద్ధికి ఐఈఆర్పీలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అంతకు ముందు ఐఈఆర్పీల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు అభినందనీయులన్నారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఐఈఆర్పీలకు ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా వచ్చేలా కృషి చేస్తామన్నారు. పీఆర్టీయూ, ఐఈఆర్పీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిలివేరు వెంకటేశ్ మాట్లాడుతూ 21 ఏండ్లుగా సమగ్ర శిక్ష అభియాన్లో విధులు నిర్వర్తిస్తున్న ఐఈఆర్పీలను విద్యాశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సదస్సులో యూనివర్సిటీ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పుల్లా శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిళి శ్రీపాల్రెడ్డి, బీరేల్లి కమలాకర్ రావు, కార్పొరేటర్ సంకు నర్సింగరావు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ఐఈఆర్పీల నాయకులు కిరణ్రెడ్డి, శ్రీధరాచారి, నర్సింహస్వామి, కపిల్రెడ్డి, సంజీవ్కుమార్, రాజయ్య, సమ్మయ్య, ప్రవీణ్, అనిల్, శ్రీకాంత్, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న చీఫ్విప్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వాహనదారుడిని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ దవాఖానలో చేర్పించి, మానవత్వం చాటుకున్నారు. టీచర్స్కాలనీకి చెందిన ఓ వ్యక్తి హనుమకొండ నుంచి కాజీపేట వైపు బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కలెక్టరేట్ ఎదుట జారిపడగా అటువైపు నుంచి వెళ్తున్న చీఫ్ విప్ వినయ్భాస్కర్ ఆ వ్యక్తిని చూసి చలించిపోయారు. తన వాహనాన్ని ఆపి, పడిపోయిన వ్యక్తిని లేపి, గాయాలను పరిశీలించారు. రోహిణి దవాఖాన డాక్టర్తో మాట్లాడి ఒక వాహనాన్ని ఇచ్చి పోలీసుల సాయంతో దవాఖానకు పంపించారు.