నర్సంపేట, మార్చి 9: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపించి బీజేపీ కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే కుట్రలో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 50 ఏండ్ల వెనుకబాటు తనాన్ని ఒక్కొక్కటిగా అధికమిస్తున్న తరుణంలో ఓర్వలేకనే రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులపై సీబీఐ, ఈడీతో దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అడ్డదారిన అధికారాన్ని చేజిక్కుంచుకోవాలనే కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్న బీజేపీకి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు దగ్గర నుంచి దేశంలో జరిగిన అతిపెద్ద స్కామ్లన్నింటికీ కేరాఫ్ అడ్రస్గా మారిన బీజేపీ.. గురివింద సామెత గుర్తెరిగదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలపై జులుం విధించి, కావాలనే చేస్తున్న కుట్రలను ఛేదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలపై అనేకసార్లు వాస్తవాలతో కూడిన ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిపై ఎక్కడా స్పందించని దర్యాప్తు సంస్థలూ.. ఒక్క తెలంగాణ, బీజేపీ యేతర ప్రభుత్వాలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాదరణ పొందిన నాయకులపై అసత్య ప్రచారాలతో అవినీతి ముద్రలు వేసి ఎదిరించి, బెదిరించి తమ పార్టీలో చేర్చుకున్న తీరుకు ఏపీకి చెందిన సుజనాచౌదరి, సీఎం రమేశ్, వెస్ట్బెంగాల్కు చెందిన టీఎంసీ నేత సువెంద్, ముఖుల్ రాయ్, హేమంత్ బీస్వా ఉదాహరణ కాదా అని ప్రశ్నించారు.
సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం..
గడిచిన ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కు విక్రయించి, విపరీతంగా పెట్రో, నిత్యావసరాల ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తూ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఎమ్మెల్యే పెద్ది ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దు నుంచి వ్యవసాయ చట్టాల వరకూ సామాన్య ప్రజలకు తీవ్ర విషాదం మిగిల్చిందన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నమైన లౌకికతత్వాన్ని నీరుగారుస్తూ మతతత్వ విద్వేశాలు రెచ్చగొడుతూ దేశ ప్రజల మధ్య అభద్రతా భావాన్ని సృష్టించి సంపదను దొడ్డ దారిన అదాని, అంబానికి దోచిపెడుతున్న తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకోకపోగా.. అజ్ఞానంలో నడిపించి దీపాలు వెలిగించి చప్పట్లు కొట్టించి చేతులు దులిపేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో కుబేరుల సంపదను రెట్టింపు చేయడాన్ని సిగ్గుచేటుగా భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కుట్ర పూరిత చర్యలను తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతమని, ఇక్కడ బీజేపీ ఆటలు సాగవని స్పష్టం చేశారు.