ఐనవోలు/గూడూరు, మే 12: మక్కల కొనుగోళ్లలో ఎడతెగని జాప్యంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల్ల రైతులు కన్నెర్ర చేశారు. సుమారు ఆరు వేల బస్తాలకు ఆరుగురు హమాలీలు అన్లోడ్ చేస్తే.. మా ట్రాక్టర్ సీరియల్ వచ్చేది ఎప్పుడు.. అన్లోడ్ అయ్యేది ఎన్న డూ .. అని మండిపడుతూ మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని, రెడ్డిపాలెంలో వేర్వేరుచోట్ల ఆందోళన నిర్వహించారు. వరంగల్-ఖమ్మం జాతీ య రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పంథిని శివారులోని రైస్ మిల్లులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల అన్లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. అ యితే అన్లోడింగ్ సెంటర్కు మూడు రోజుల క్రితం ట్రాక్టర్లలో తెచ్చిన మక్కలను గోదాముల్లోకి తరలించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంత రం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయిం చి ‘సీఎం డౌన్.. డౌన్.. కాంగ్రెస్ పాలన వద్దు..’ అని నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందిం చి హమాలీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. రైతులు సుమారు ఆరగంట పాటు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. నందనం సొసైటీ ఆధ్వర్యంలో రెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన అన్లోడింగ్ పాయింట్ వద్ద సుమారు 100 ట్రాక్టర్ల వరకు అన్లోడ్ కావాల్సి ఉండగా జాప్యం నెలకొనడంతో రాస్తారోకో చేశారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో 20 రోజుల క్రితం మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే నేటికీ కాంటా వేయడం లేదని రైతులు నిరసన తెలిపి ఎన్హెచ్- 365పై రాస్తారోకో చేపట్టారు. గన్నీ సంచుల కొరతకు తోడు, అవసరమైన మేరకు లారీలను కేటాయించడం లేదన్నారు. అకాల వర్షాలతో పంటలు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ వినయ్కుమార్ సిబ్బందితో వచ్చి రైతులతో మాట్లాడారు. మార్ఫెడ్ అధికారులతో చర్చించి పంటను కొనుగోలు చేయాలని కోరడంతో రైతులు శాంతించారు.