స్టేషన్ఘన్పూర్, డిసెంబర్ 28 : వచ్చే వానకాలం నాటికి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని రిజర్వాయర్ల కింద ఉన్న పంట కాల్వలకు మరమ్మతు చేపట్టి, సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన చింతగట్టు దేవాదుల చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.104 కోట్లు సంవత్సరం క్రితం మంజూరు చేసిందన్నారు. వాటితో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని పనులు మధ్యలో నిలిచిపోయాయని, ఇంకొన్ని టెండర్లు పూర్తయినప్పటికీ ప్రాజెక్ట్ డిజైన్ చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదన్నారు. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి జూన్ చివరి నాటికి పూర్తి చేసి, జూలై సాగునీరు అందించాలని ఆదేశించారు. అశ్వరావుపల్లి రిజర్వాయర్ కింద ఉన్న గ్రావిటీ కెనాల్లో కూరకుపోయిన మట్టి, తుంగను తొలగించి మరమ్మతులు చేపట్టాలన్నారు. కాల్వ నిర్మాణంలో భూ సేకరణ సమస్యను పరిష్కరించి కాల్వలు నిర్మిస్తే లింగాలఘనపురం మండలంలోని 9 గ్రామాలకు చెందిన 17వేల ఎకరాలతోపాటు ఎగువ ప్రాంతాలకు సైతం సాగునీరు అందుతుందన్నారు. మల్లన్నగండి వద్ద లిఫ్ట్-1 ద్వారా చిల్పూరు మండలంలోని మూడు గ్రామాలకు, వేలేరు మండలంలో మూడు గ్రామాలకు, తరిగొప్పుల మండలంలోని ఆరు గ్రామాలకు కలిపి 6,794 ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు.
లిఫ్ట్ – 2 ద్వారా ధర్మసాగర్ మండలం సోడషపల్లితోపాటు ఇంకొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. ట్రయల్ రన్ను పూర్తి చేసి 12 చెరువులను నింపే ప్రయత్నం చేయాలన్నారు. ధర్మసాగర్ పెద్ద చెరువును రిజర్వాయర్గా మార్చుకున్నామని, కానీ, దాని కింద ఉన్న పంట పొలాలకు సాగునీరు అందించడం లేదన్నారు. నక్కల తూము ద్వారా 4వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కడియం సూచించారు. నష్కల్ రిజర్వాయర్ వద్ద లిఫ్ట్- 3 ఏర్పాటు చేయడం వల్ల నష్కల్ గ్రామానికి 1800 ఎకరాలతోపాటు వంగాలపల్లి, ధర్మపురం, మలక్పల్లి గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందన్నారు. లిఫ్ట్ ఏర్పాటుకు డిజైన్ పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. జఫర్గఢ్ మండలంలోని ధంసా చెరువును బ్యాలెన్స్ రిజర్వాయర్గా మార్చేందుకు టెండర్లు పూర్తయినా ఇంకా పనులు పూర్తి కాలేదని, జూన్ చివరి నాటికి పనులు పూర్తి చేసి జూలైలో సాగునీరు అందించాలన్నారు. స్టేషన్ఘన్పూర్ పెద్ద చెరువును, రాజావరం చెరువును కలిపి రిజర్వాయర్గా మార్చామన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ రమేశ్ బాబు, ఎస్ఈ సుధాకర్రెడ్డి, సుధీర్, ఈఈలు మంగీలాల్, వినయ్బాబు, డీఈలు, ఏఈలు, వేలేరు జడ్పీటీసీ చాడ సరిత, ఎంపీపీ సమ్మిరెడ్డి, రాంబాబు, సర్పంచ్లు గణపతి పాల్గొన్నారు.