డోర్నకల్, సెప్టెంబర్ 24 ;సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చిపెట్టే డ్రాగన్ ఫ్రూట్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఒక్కసారి సాగుచేస్తే సుమారు 25 ఏండ్ల పాటు మంచి దిగుబడి రావడం, మార్కెట్లోనూ ఈ పండ్లకు డిమాండ్ ఉండడంతో పాటు ప్రభుత్వం సబ్సిడీపై పరికరాలు ఇస్తున్నందున చాలామంది ఈ పంట వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఒక ఎకరానికి ఏటా రూ.3లక్షల వరకు ఆదాయం రావడమే గాక ఔషధ గుణాలున్న ఈ ఫ్రూట్ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.
రైతులు సంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నా రు. ఉద్యాన పంటలైన పండ్ల తోటలు సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జామ, మామిడితో పాటు ఇటీవల డ్రాగన్ ప్రూట్ సాగును జిల్లాలో రైతులు మొదలుపెట్టారు. ఒక్కసారి సాగు చేస్తే 20 ఏళ్ల వరకు పంట దిగుబడి పొందవచ్చు. డ్రాగన్ ప్రూట్ సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందవచ్చు. ఎకరానికి సంవత్సరంలో రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. సాగు చేసే రైతుకు మొదటిసారి ఎకరానికి రూ.5 లక్షలు ఖర్చు వస్తుంది. ఆ తర్వాత 20 సంవత్సరాలు వరకు ఎలాంటి ఖర్చు ఉండదు. ఒక్కో మొక్క ధర రూ.30-40 ఉంటుంది. డ్రాగన్ ప్రూట్ పంట సాగు చేసే రైతులను ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తూ సబ్సిడీపై పరికరాలు అందజేస్తున్నది. పంటకు తెగుళ్లు సోకే ప్రమాదం తక్కువే.
వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటలో మంచి దిగుబడి సాధించవచ్చు. మహబూబాబాద్ జిల్లాలో 20 ఎకరాలపైనే డ్రాగన్ ప్రూట్ సాగవుతోంది. క్రమంగా పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పండుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో డ్రాగన్ ప్రూట్కు సుమారు రూ.200 వరకు ధర పలుకుతున్నది. ఇందులో ఔషధ గుణాలు, అత్యధిక పోషకాలు ఉండడంతో ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రామానికి చెందిన ముత్తయ్య, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గంగ్యాతండాలో వీరభద్రారావు, కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో శ్రీనివాస్ అనే రైతులు డ్రాగన్ ప్రూట్ సాగులో మంచి లాభాలు గడించారు.
పంట సాగుపై అవగాహన కల్పిస్తున్నాం
డ్రాగన్ ప్రూట్ సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఒక్కసారి సాగు చేస్తే 20 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తుంది. రైతులకు ఆదాయం తెచ్చిపెట్టే పంట ఇది. మొక్క పెరిగే కొద్దీ కొమ్మలు పెరిగి దిగుబడి పెరుగుతుంది. 6 సంవత్సరాల తర్వాత ఎకరానికి రూ.4 లక్షల నుంచి 5 లక్షలు పొందవచ్చు. ఖమ్మం జిల్లా గోవింద్రాల, గంగ్యాతండా రైతులు మంది దిగుబడి సాధిస్తున్నారు. రైతులు నూతన పంటలపై ఆసక్తి చూపి లాభాలు పొందాలి.
– అనితశ్రీ, మండల ఉద్యానవన అధికారిణి
నాలుగెకరాల్లో పంట వేశా..
నేను నాలుగు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ వేశా. మొదటి దశలో పంట చేతికి వచ్చింది. ఈ పండ్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పంట సాగులో పశువుల పేడ మాత్రమే ఉపయోగించాను. ఉద్యానవన అధికారులు పంట సాగుపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. చీడపీడల బెడద కూడా తక్కువే ఉంటుంది. డ్రాగన్ ప్రూట్ సాగును మా పిల్లలు ప్రోత్సహిస్తున్నారు.
– కోలేటి రవీందర్, రైతు , బూర్గుపాడు
డ్రాగన్ ప్రూట్ ప్రయోజనాలివీ..