జయశంకర్ భూపాలపల్లి, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : వరి, మిర్చి, పత్తి, మక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగుతో సంతృప్తి చెందని ఆ రైతు దీర్ఘకాలంగా లాభాలు తెచ్చిపెట్టే పంటలపై దృష్టిపెట్టాడు. వరంగల్ పరిశోధన కేంద్రంలో మెళకువలు తెలుసుకొని తనకున్న పదెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, శ్రీగంధం, మహాగని, తైవాన్ జామ, స్కై ఫ్రూట్, మల్బరీ లాంటి వైవిధ్యమైన పంటలు పండిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. అది కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లికి చెందిన జంగిలి కృష్ణమూర్తి. వ్యవసాయంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ ఉత్తమ రైతుగా అధికారుల మన్ననలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కృష్ణమూర్తికి పదెకరాల భూమి ఉండగా మూడెకరాల్లో డ్రాగన్ఫ్రూట్ తోట వేశాడు. మొరాకన్ రెడ్ రకం ఫ్రూట్తో దిగుబడి ఎక్కువ వస్తుందని తెలుసుకొని కలకత్తా నుంచి 145 మొక్కలు తెప్పించాడు. ప్రత్యేకంగా పోల్స్ ఏర్పాటుచేసి వాటిని నాటాడు. ఎకరానికి సుమారు రూ.5లక్షల ఖర్చుతో పంట సాగుకు శ్రీకారం చుట్టాడు. నాటిన రెండో ఏట నుంచి కాత రావడం మొదలైంది. మూడు టన్నుల దిగుబడి రాగా ఐదో ఏట నుంచి ఎనిమిదిన్నర టన్నులకు పెరిగింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. ఈ ఆరు నెలల్లో వచ్చే క్రాప్తో అన్ని ఖర్చులు పోను రూ.5 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాడు. 20ఏళ్ల వరకు ఈ మొక్కలు ఫలాలు ఇస్తూనే ఉంటాయి. ముదిరిన డ్రాగన్ ఫ్రూట్ మొక్క కాండాలను కట్ చేసి భూమిలో నాటుతూ తోటను విస్తరిస్తున్నాడు.
తాను పండించిన డ్రాగన్ ఫ్రూట్ పంటను వ్యాపారులకు కాకుండా నేరుగా వినియోగదారులకే విక్రయిస్తూ అధిక లాభాలు గడిస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో పండిస్తుండడంపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వరంగల్, గోదావరిఖని, జమ్మికుంట, పరకాల, కరీంనగర్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తి రెగ్యులర్ కస్టమర్లు కూడా అయ్యారు. వాట్సాప్ ద్వారా ఆర్డర్ తీసుకుని ఆర్టీసీ కార్గో ద్వారా డ్రాగన్ ప్రూట్ను పార్సిల్ చేసి పంపిస్తున్నాడు. వ్యాపారులు కిలోకు రూ.150 చొప్పున విక్రయిస్తుండగా కృష్ణమూర్తి మాత్రం వినియోగదారులకు ఒక ఫ్రూట్కు రూ.100 నుంచి రూ.150 వరకు తీసుకుంటున్నాడు. కృష్ణమూర్తి ఉత్తమ రైతు అవార్డులతో పాటు రైతుబంధు సంబురాల్లో ప్రశంసా పత్రం అందుకున్నాడు.
కృష్ణమూర్తి తనకున్న మిగతా ఏడెకరాల్లోనూ దీర్ఘకాలిక పంటలు వేశాడు. శ్రీగంధం, మహాగని, తైవాన్ జామ, స్కై ఫ్రూట్, పసుపు, గుమ్మడి, మల్బరీ లాంటి విభిన్న పంటలు వేశాడు. ఐదేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్తో పాటే ఈ తోటలు సాగు చేయడం ప్రారంభించాడు. ఇప్పటికే మల్బరీ పంట కోతకు రాగా విక్రయించి రూ.5 లక్షల వరకు ఆదాయం ఆర్జించాడు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న శ్రీగంధం చెట్లు మరో 15 ఏళ్లకు చేతికందుతాయి. తైవాన్ జామ, స్కై ఫ్రూట్, గుమ్మడిని అంతర పంటలుగా సాగుచేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నాడు. ఇలా పదెకరాల్లో వైవిధ్యమైన పంటలను తనదైన శైలిలో పండిస్తూ ప్రత్యేకతను సొంతం చేసుకున్నాడు.
మెళకువలు తెలుసుకొని ముందడుగు వేశా పత్తి, మిర్చి లాంటి సాధారణ పంటలు వేశా. దీర్ఘకాలికంగా అధిక ఆదాయం వచ్చే పంటలు వేయాలనుకున్నా. తెలిసిన అధికారులతో వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి వెళ్లి పంటల గురించి నేర్చుకున్నా. వారి సలహాలతో డ్రాగన్ ఫ్రూట్ను ఎంచుకున్నా. ఎకరానికి రూ.5 లక్షల పెట్టుబడి అయింది.
అప్పటినుంచి ఈ ఐదేళ్లలో వేప నూనె, పసుపు, కొబ్బరినూనె తదితర పదార్థాలను ఉపయోగిస్తూ సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాం. మూడేళ్లుగా ఆరు నెలలకు అన్ని ఖర్చులు పోను రూ.5లక్షల ఆదాయం వస్తున్నది. నాకంటూ ప్రత్యేక కస్టమర్లు ఉన్నారు. క్రాప్ రాగానే ఫోన్లు చేస్తుంటారు. వారికి ప్యాక్ చేసి ఆర్టీసీ కార్గోలో పంపిస్తుంటా. ఏడెకరాల్లో శ్రీగంధం, మహాగని, మల్బరీ వేశా. మల్బరీ ఒక క్రాప్ తీశా. రూ.5 లక్షల దాకా ఆదాయం వచ్చింది. మరో 15 ఏళ్లలో శ్రీగంధం చేతికొస్తుంది. – జంగిలి కృష్ణమూర్తి, రైతు