ఖిలావరంగల్, జనవరి 24: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పేదల సొంతంటి కల త్వరలోనే సాకారం కానుందని, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు. దుపకుంటలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనుల పురోగతిపై హౌసింగ్, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. పేదలు సమాజంలో ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల ఇంటి నిర్మాణ పథకం ప్రారంభించినందన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి 2200 ఇండ్లు మంజూరు చేశారని వివరించారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, పేదల కల సాకారం చేయాలన్నదే సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్ష అన్నారు. అనంతరం గృహ సముదాయంలో తాగునీరు, విద్యుత్, పారుల ఏర్పాటు తదితర అంశాలపై ఎమ్మెల్యే క్షుణ్ణంగా అధికారులతో చర్చించి, సలహాలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎకడా రాజీ పడొద్దన్నారు. పది కాలాలపాటు ఇండ్లు మన్నికగా ఉండేలా నిర్మాణం ఉండాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్ జోషి, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, ఖిలావరంగల్ తహసీల్దార్ ఫణికుమార్ పాల్గొన్నారు.
పేదలకు వరం.. ‘కల్యాణలక్ష్మి’
గిర్మాజీపేట: పేదింట్లో ఆడబిడ్డల పెళ్లిళ్లను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం వరంగా మారిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శివనగర్లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో నియోజకవర్గానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు రూ. 16,76,972 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదన్నారు. ముఖ్యంగా నిరుపేదల ఇండ్లలో ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కావొద్దని, వారి ఆర్థిక కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి శ్రీకారం చుట్టి, రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేసి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తూ బంగారు తెలంగాణ దిశగా సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణ, సురేశ్ జోషి, బోగి సువర్ణ, బీఆర్ఎస్ నాయకుడు ముష్కమల్ల సుధాకర్, మాజీ కార్పొటర్లు పాల్గొన్నారు.