దేవరుప్పుల, నవంబర్ 16 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 60 ఏళ్లు వెనక్కి వెళ్తామని, పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దేవరుప్పుల మండలం రామచంద్రాపురం, పెదతండా, చిప్పరాళ్ల బండ తండా, నల్లకుంట తండా, రాంభోజీగూడెం, కోలుకొండ, అప్పిరెడ్డిపల్లి, చినమడూరు, బంజర గ్రామాల్లో ప్రజలను కలిశారు. ఆరోగ్యక్ష ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్రావుతో పాటు ఎర్రబెల్లి పాల్గొన్న ఈ ప్రచారంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకగా, భారీ జన సమీకరణ మధ్య ఎర్రబెల్లి రోడ్షో నిర్వహించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు పథకం అమలు కాదని, కరెంటు కోతలు తప్పవన్నారు. ధరణిని తీసేస్తే మళ్లీ దళారులు రాజ్యమేలుతరు తప్ప.భూములకు భద్రత ఉండదన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించి గెలిపిస్తే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలవుతాయని ఎర్రబెల్లి వివరించారు. రైతుబీమా పథకం మాదిరిగా ప్రతి పౌరుడికి బీమా సౌకర్యం అందుతుందన్నారు. వంటగ్యాస్ సిలిండర్ను రూ. 400కే అందిస్తామన్నారు.
తాను తొలిసారి పాలకుర్తి నుంచి గెలిచినప్పుడు ఇక్కడి సమస్యలను చూసి చలించిపోయానని, అనంతరం కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మంత్రినైనా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించానని, కరోనా కష్ట కాలంలో సాయం చేశానని గుర్తు చేశారు. నియోజకవర్గానికి 10 వేల ఇండ్లు మంజూరు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ను కోరగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గిరిజన బంధును అమలు చేసేందుకు గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. స్థానిక సమస్యలుంటే తనకు నేరుగా ఫోన్ చేయొచ్చని, వ్యక్తిగతంగా కలిసినా పరిష్కరిస్తానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. నియోజకవర్గం మొత్తంలో సాగునీరు, తాగునీరు సమస్యలను అధిగమించామని, గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసుకున్నామన్నారు. ఇంటింటికీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఈ ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, మండలాధ్యక్షుడు తీగల దయాకర్ పాల్గొన్నారు