హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 9: ‘ఓయూ విద్యార్థుల అరెస్ట్, అసెంబ్లీ ముందు ఇనుప కంచెల విస్తరణ, వ్యవసాయ వర్సిటీ భూముల విషయంలో విద్యార్థుల జుట్టుపట్టి లాగడం.. ఇదీ కాంగ్రెస్ ప్రజాపాలన. కాంగ్రెస్ రావడం అంటే కష్టాలు రావడమేనని ప్రజలకు ఇప్పుడే తెలుస్తోంది’ అని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం హనుమకొండలోని పార్టీ ఆఫీస్లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కానీ గవర్నర్ ప్రసంగంలో సోనియాగాంధీ దయతో తెలంగాణ ఇచ్చిందనడం సరికాదన్నారు. బీడు పొలాలకు దాహార్తిని తీర్చిన నాయకుడు, 50ఏళ్ల కలను సాకారం చేసిన ఉద్యమనేతకు చాలా చిన్న చాంబర్, విడివిడిగా రెండు రూంలు కేటాయించడం.. ఇదీ కాంగ్రెస్ సంస్కారమని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన శాంపిల్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో తీవ్రరూపం చూపిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఫీనిక్స్ పక్షిలాంటిదని, తిరిగి కొత్త ఆలోచనలు, రెట్టింపు శక్తితో మళ్లీ వస్తుందన్నారు. ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని మోడీతో మాట్లాడారని, ఇద్దరు కలిసి బీఆర్ఎస్ను లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు.
ప్రణయ్భాస్కర్ అసెంబ్లీలో జై తెలంగాణ నినాదాలు చేశారని, తమ్ముడు వినయ్భాస్కర్ కాకతీయ ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ మంత్రుల ఎదుట బైఠాయించి తెలంగాణ నినాదాలు చేశారని గుర్తుచేశారు. మార్పు రావాలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చనుందని, ప్రజలకు కొత్తగా ఖర్చులు రానున్నాయని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రిది ఉద్యమద్రోహి చరిత్ర అన్నారు. అవగాహన లేని, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టును కేంద్రానికి ధారాదత్తం చేసిందని, నీళ్లు ఎవరికి వదలాలనేది వారిచేతిలోనే పెట్టిందన్నారు. ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉండాలని కండీషన్ పెట్టడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారని, గులాబీ జెండానే వారికి రక్షణ కవచమన్నారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ ప్రసంగం మధ్యలో పాటలు పాడుతూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. పీవీ శతజయంతి ఉత్సవాల ఫలితంగా తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం అభినందనీయమన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు వేధిస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రతినెలా 10వ తేదీలోగా సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తానని అన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అందించినా విస్తృతప్రచారం లేకపోవడం, ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందని చెప్పారు. ఉద్యమ సమయంలో నాతోపాటు కేసుల్లో ఉన్నవారికి పార్టీని ఒప్పించి, మెప్పించి పదవులు ఇప్పించినట్లు గుర్తుచేశారు. ఉద్యమాలు కొత్త కాదని, తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేశామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి దళితబంధు ఇచ్చారని, బీసీ, మైనార్టీ బంధు కూడా ఇచ్చామని, వాటిని అమలు చేసేవరకూ ఉద్యమిస్తామన్నారు. పేదలు గుడిసెలు వేసుకుంటే పట్టాలు ఇప్పించామన్నారు.
కాంగ్రెస్లో పేదల గురించి ఆలోచించే నాయకుల్లేరని, అందుకే గుడిసెలు, తోపుడు బండ్లు తొలగిస్తున్నారని, స్ట్రీట్వెండర్స్ యాక్ట్ సుప్రీంకోర్టు నుంచి వచ్చిందని, తొలగించే హక్కు ఎవరికీ లేదని, పేదల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. కులసంఘాలకు భవనాలు కేటాయించామని, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు త్వరలోనే బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి కమిటీలు వేస్తామన్నారు. త్వరలో డివిజన్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి, పార్టీ కోసం పనిచేసేవారిని గుర్తించి పదవులు ఇస్తామన్నారు. కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సుందర్రాజ్ యాదవ్, కార్పొరేటర్లు బొంగు అశోక్యాదవ్, చెన్నం మధు, మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ, జోరిక రమేశ్, బీఆర్ఎస్ నాయకులు జనార్దన్గౌడ్, ఉడుతల సారంగపాణి, పులి రజినీకాంత్, కంజర్ల మనోజ్కుమార్ పాల్గొన్నారు.