సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. మనిషికి శరీరంలో కండ్లు చాలా ముఖ్యమైనవి. వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిలలాడిపోతాం. ప్రస్తుత సీజన్లో వచ్చే కండ్ల కలక పిల్లలు, పెద్దలను కలవరపెడుతోంది. కళ్లు ఎర్ర బారిపోయి నీళ్లు రావడం, రాత్రి పూట పూర్తిగా ఊసులతో మూసుకుపోవడం, ఇసుక పోసినట్లు గరగరలాడుతూ ఇబ్బందులు పెడుతోంది. ఇది అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తోంది. ఈ క్రమంలో సొంత వైద్యం వద్దని, ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, భౌతిక దూరం, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
– భూపాలపల్లి టౌన్, ఆగస్టు 9
జిల్లాలో గత పది రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పులతో కండ్ల కలక వ్యాధి విస్తరిస్తున్నది. కండ్ల కలకను పింక్ అంటారు. కంటి గుడ్డు చుట్టూ ఉండే తెల్లని పొర, కంటి రెప్పల వెనుక ఉండే పొరను కంజెటైవా అంటారు. కండ్లు తెరిచి ఉండడంతో దుమ్ము, ధూళి, వేడి, చలి, నీళ్లు ఏదైనా ప్రభావం చూపిస్తాయి. దీంతో వచ్చే ఇన్ఫెక్షన్నే కండ్ల కలక అంటారు. ఇది బ్యాక్టీరియా, వైరస్తో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది చిన్నపాటి ఇన్ఫెక్షన్గా అనిపించినా రోజు వారీ పనులు చేసుకోకుండా, ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేస్తుంది. వాన కాలంలో మురికి, కాలుష్యం పెరగడంతో కండ్ల కలక సోకుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు పాటించడంతో పాటు కండ్ల కలక సోకితే సమీపంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు.
కండ్ల కలక వైరస్ సోకిన వారు సొంత వైద్యం చేసుకొని ఇబ్బందులకు గురికావొద్దు. మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉండాలి. జిల్లాలో ఈ వ్యాధి పెరుగుతుండడంతో ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచాం. పాఠశాలల్లో వైరస్ లక్షణాలు కనిపించిన పిల్లలను వెంటనే ఇంటికి పంపించాలని కోరాం.
– డీఎంహెచ్వో శ్రీరాం