హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 19 : మేడారం మహాజాతరను కాలుష్య, ప్లాస్టిక్ రహితంగా జరుపుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారి సునీత ఒక ప్రకటనలో కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారులు పర్యావరణ అనుకూల మేడారం జాతర ప్రచారానికి 6 వేల పోస్టర్లు, 300 క్లాత్ బ్యానర్ల ప్రదర్శనతో పాటు మొబైల్ వ్యాన్ ద్వారా స్కూల్ పిల్లలు, గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పొందిన 300 మంది వలంటీర్లు జాతరలో వస్త్ర సంచుల పంపిణీ, కళాజాత నిర్వహిస్తామన్నారు.
రేడియోలో జింగిల్స్ ప్రసారం, టీవీల్లో స్క్రోలింగ్, మాంసం, ఇతర వ్యర్థాలను నేరుగా రెండరింగ్ ప్లాంట్లకు పంపడం, బెల్లం సేకరణ, బయో మెడికల్ వ్యర్థాలను నిర్వీర్యం చేసే పరిశ్రమకు పంపిస్తామని అందులో పేర్కొన్నారు. జంపన్న వాగులో నీటి నాణ్యతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు భక్తులు ప్లాస్టిక్ వస్తువులను తీసుకురావొద్దని, వస్త్ర సంచులు, స్టీల్ గ్లాసులు వినియోగించి పర్యావరణ హిత జాతర జరుపుకోవాలని ఆమె కోరారు.