వాజేడు, మార్చి12 : గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీలో మంగళవారం డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య పర్యటించారు. గుమ్మడిదొడ్డి గ్రామస్తులు జ్వరాల బారిన పడిన విషయమై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటికి స్పందించిన డీఎంహెచ్వో గుమ్మడిదొడ్డి, సుందరయ్యకాలనీ, ఇప్పగూడెం గ్రామాలను సందర్శించి వైద్య సిబ్బందితో కలిసి బాధితులను పరీక్షించారు. అనంతరం స్థానిక పీహెచ్సీని తనిఖీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జ్వరాలు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారిని గుర్తించి 70 మందికి పైగా పరీక్షలు చేసి ల్యాబ్కు పంపామని చెప్పారు.
తాగునీటి పరీక్షలు కూడా చేశామ ని తెలిపారు. చాలామందికి వైరల్ ఆర్థరైటిస్ వల్లే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి జ్వరం తగ్గినా వారం రోజుల పాటు కీళ్ల నొప్పులు ఉంటాయన్నారు. మందులు వాడుతూ విశ్రాంతి తీసుకుంటే నయమవుతుందన్నారు. గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు చేస్తే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ శ్రీరాముల శ్రీనివాస్, వైద్యాధికారులు రహిల్, మహేందర్, అభినవ్, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి పాల్గొన్నారు.