వరంగల్(నమస్తే తెలంగాణ), ఆగస్టు 4: మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. వరంగల్ జిల్లాలోని 63, హనుమకొండ జిల్లాలో 65 మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులు చంద్రశేఖర్, ఆర్ లక్ష్మానాయక్ వెల్లడించారు. ఆయా జిల్లాల సూపరింటెండెంట్ కార్యాలయాల్లో శుక్రవారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో వారు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్ లక్ష్మానాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వరంగల్ జిల్లాలోని 63 మద్యం దుకాణాలకు 2023-25 సంవత్సరానికి టెండర్ల ప్రక్రియ నిర్వహించడానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రకటించారు.
జిల్లాలోని 63 మద్యం దుకాణాల్లో 11 రూ. 50 లక్షలు, 46 రూ. 55 లక్షలు, 6 రూ. 85 లక్షలు స్లాబ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. 14 గౌడ, 6 ఎస్సీ, 2 ఎస్టీలకు రిజర్వ్డ్ చేసినట్లు వెల్లడించారు. 41 మద్యం దుకాణాలు అన్ రిజర్వ్డ్ కేటగిరీల్లో ఉన్నట్లు చెప్పారు. హనుకొండలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఈ నెల 6, 13, 15న సెలవుగా ప్రకటించారు. జిల్లా ప్రొహిబిషిషన్, ఎక్సైజ్ కార్యాలయంతోపాటు హైదారాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21న ఉదయం 11 గంటలకు లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. వరంగల్ ఉర్సులోని రంగలీలా మైదానం సమీపంలోని నాని గార్డెన్స్లో మద్యం దుకాణాలకు కేటాయింపులు జరుగుతాయన్నారు. తొలిరోజు పరకాల, వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు మద్యం దుకాణాలకు మహిళలు దరఖాస్తులు అందజేసినట్లు చెప్పారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
సుబేదారి: హనుమకొండ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లు ప్రారంభమైనట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో ఆయన కొత్త మద్యం పాలసీపై వివరాలు వెల్లడించారు. హనుమకొండ (పాత వరంగల్ అర్బన్) జిల్లాలోని హనుమకొండ, వరంగల్ అర్బన్, ఖిలావరంగల్, కాజీపేట ఎక్సైజ్ స్టేషన్ల నుంచి మొత్తం 65 షాపుల్లో ఎస్సీలకు 10, ఎస్టీ ఒకటి, గౌడ సామాజిక వర్గానికి 15, మిగతా 39 షాపులు ఓపెన్ క్యాటగిరీలో కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 18 సాయంత్రంలోగా దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడించారు. ప్రతి షాపునకు రూ. 2 లక్షల చొప్పున ఆప్లికేషన్ ఫీజు జిల్లా ఎక్సైజ్ అధికారి పేరుతో బ్యాంకులో డీడీ లేదా చలాన్ తీసి ఆధార్కార్డు, పాన్కార్డు దరఖాస్తు ఫారానికి జతచేసి కలెక్టరేట్లోని కౌంటర్లో అందజేయాలని సూచించారు. ఒకరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 21న కలెక్టర్ సమక్షంలో హనుమకొండ అంబేద్కర్ భవన్లో డ్రా పద్ధతిలో ఎంపిక ఉంటుందన్నారు.
కొత్త మద్యం పాలసీ డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాపు-1, షాపు-12 , షాపు-17, షాపు- 18, షాపు-20, షాపు-24, షాపు-29, హనుమకొండ షాపు-48, షాపు-60, షాపు-నంబర్ 61ని ఎస్సీలకు చేటాయించారన్నారు. షాపు-31ని ఎస్టీలకు చేటాయించినట్లు వెల్లడించారు. అలాగే, షాపుల నంబర్లు 15, 21, 23, 26, 32, 33, 35, 43, 46,47, 49, 53, 62, 64, 65ను గౌడ సామాజిక వర్గానికి కేటాయించారన్నారు. మద్యం షాపులు మూడు స్లాబ్ల్లో ఉన్నట్లు చెప్పారు. 5 వేల జనాభా ఉన్న షాపులు 64, 65 నంబర్ షాపులు, వీటి రెండెళ్ల లైసెన్స్ ఫీజు రూ. 50 లక్షలు. 5 వేల నుంచి 50 వేల ఉన్న షాపులు 11 ఉన్నాయి. 45, 46, 47, 48, 49, 50, 59, 60, 61, 62, 63 నంబర్గల మద్య దుకాణాలకు లైసెన్స్ ఫీజు రూ. 55 లక్షలు. మిగతావి లక్ష నుంచి 20 లక్షల జనాభా ఉన్నవి. వీటి లైసెన్స్ ఫీజు రూ. 85 లక్షలు. ఈ ఫీజు ఆరు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. సమావేశంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, రంజిత్రావు, చంద్రమోహన్ పాల్గొన్నారు.