నర్సంపేట వేదికగా ఆదివారం పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది. డివిజన్లోని 3,271మంది రైతులకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ హక్కు పత్రాలు ఇవ్వగా అందుకొని గిరిజనం మురిసిపోయింది. పట్టాలు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులు, వారి కుటుంబాలతో సభా ప్రాంగణం కళకళలాడగా, కళాకారుల గిరిజన సంప్రదాయ నృత్యాలతో వ్యవసాయ మార్కెట్ ఆవరణ హోరెత్తింది. అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం అయిందని.. పోడు రైతులకు ఇంతపెద్ద మొత్తంలో పట్టాలు ఇవ్వడం దేశంలోనే ఇదే మొదటిసారి అని అన్నారు. 6నుంచి 10శాతం రిజర్వేషన్, తండాలను గ్రామ పంచాయతీలు, గురుకులాలు, పండుగలకు గుర్తింపు, ఇలా అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూనే తాజాగా పోడు భూములకు పట్టాలు అందించి ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మబంధువని పేర్కొన్నారు. హక్కు పత్రాలతో రైతుబంధు, రైతుబీమా కూడా వర్తిస్తుందని మంత్రి తెలిపారు.
– నర్సంపేట, జూలై 2
నర్సంపేట, జూలై 2 : సీఎం కేసీఆర్ రైతులకు పోడు పట్టాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని, పోడు పట్టాలను అందించి దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి డివిజన్లో 3271 మంది రైతులకు 7,333 ఎకరాల భూమికి సంబంధించి హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 4,06,369 ఎకరాలకు సంబంధించిన పోడు భూములకు 1,51,730 మంది రైతులకు పట్టాలు ఇచ్చారన్నారు. ఎన్నికలకు ముందు పోడు రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు. పోడు చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 3 లక్షల 8వేల ఎకరాలకు మాత్రమే పట్టాలు పంపిణీ చేశారని, కానీ ఇవాళ ఒకేసారి 4లక్షల ఆరువేల పైచిలుకు పట్టాలు ఇవ్వడంతో పాటు రూ.412 కోట్లను రైతుబంధు కింద, వానకాలం, యాసంగి పంటలకు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. కేసీఆర్ గిరిజనుల ఆత్మబంధువని, గిరిజనుల పక్షపాతి అని పేర్కొన్నారు. వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధి ఈ తొమ్మిదేళ్లలోనే చేసి చూపెట్టారని కొనియాడారు. పోడు కమిటీకి చైర్మన్గా ఉండి పట్టాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో సీసీ రోడ్ల కోసం రూ.75 కోట్లు, మరో రూ.25 కోట్లను కొత్త రోడ్ల కోసం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 3,146 తండాలను జీపీలుగా మార్చి పరిపాలన భవనాల కోసం రూ.600 కోట్లు కేటాయించారన్నారు.
పోడు పట్టాలతో పాటు రైతుబంధు, బీమా : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
పోడు రైతులకు పట్టాలు ఇవ్వడంతో పాటు, రైతుబంధు, రైతుబీమా కూడా వర్తింపచేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. ఇన్ని రోజులు పోడు భూమికి విలువ లేదని ప్రస్తుతం పట్టా భూమికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో పోడుకు కూడా అన్ని కల్పించామన్నారు. పట్టాలతో అన్ని హక్కులు రైతులకు వచ్చాయని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.75 కోట్లతో తండాలకు బీటీ రోడ్లు వేయడానికి సీఎం కేసీఆర్ నిధులు ఇచ్చారని తెలిపారు. పోడు రైతులు సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు.
గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎంపీ మాలోత్ కవిత
గిరిజన పక్షపాతి సీఎంకేసీఆర్ అని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు తండాలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయన్నారు. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలకు కనీస సౌకర్యాలను కల్పించారని అన్నారు. 3800 తండాలను జీపీలుగా చేయడం వల్ల ఎంతో మంది గిరిజనులు సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారని, ఎంతోమందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని అన్నారు. గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ను కొలిచినట్లే సీఎం కేసీఆర్ను కూడా ఆరాధించాలని కోరారు.
పోడు రైతులకు సహకారం అందిస్తాం : కలెక్టర్ ప్రావీణ్య
పోడు రైతులకు సహాయ సహకారం అందిస్తామని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. గతంలో 1700 పట్టాలు ఉంటే ఇప్పుడు 3271 పోడు పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు. పోడు భూముల్లో లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలనే విషయమై వ్యవసాయ, ఉద్యానవన అధికారులు అవగాహన కల్పిస్తారని చెప్పారు. ప్రభుత్వం అందించే పథకాలతో లబ్ధిపొంది కుటుంబం, గ్రామం, అన్ని విధాలుగా అభివృద్ధి చెంది గ్రామ రూపురేఖలు మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఐటీడీఏ పీవో అంకిత్, ఎంపీపీలు వేములపల్లి ప్రకాశ్రావు, కళావతి, రమేశ్, కోమల, జడ్పీటీసీలు పత్తినాయక్, సుగుణ, ఆర్డీవో శ్రీనివాసులు, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మోతె జైపాల్రెడ్డి, బుర్రి తిరుపతి, నామాల సత్యనారాయణ, సారంగపాణి, డీటీడీఓ లత, తహసీల్దార్ రామ్మూర్తి పాల్గొన్నారు.
ఎన్నో ఏళ్ల కల తీర్చిండు..
పట్టాలు వత్తయని వేయి కళ్లతో ఎదురుచూసినం. ఎన్నో ఏళ్ల కలను సీఎం కేసీఆర్ సారు తీ ర్చిండు. సర్వేలు చేత్తాంటె ఇగ పట్టాలు వత్తయని సంబురపడ్డం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఇవి వచ్చినయ్. సర్కారు గింత మందికి పట్టాలిచ్చుడు గొప్ప విషయం. పోడు రైతులందరూ కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం. రైతుబంధు డబ్బులు, రైతు బీమాను కూడా వత్తే పోడు రైతులకు మేలు కలుగుతది. ఇయ్యాల నిజమైన పండుగ. నర్సంపేటలో పట్టాలు ఇత్తామని చెప్పగానే అందరం వచ్చినం.
– వేంపల్లి వసంత, మంగళవారిపేట
భయాలన్నీ పోయినయ్..
అడవి భూమిని పోడు కొట్టుకుని ఎవుసం చేసి ఏటా పంట పండించుకుని తినేటోళ్లం. భూమిల ఇత్తనాలు ఏత్తె అధికారులొచ్చి చెడగొట్టొటోళ్లు, మళ్లీ ఇత్తనాలు ఏసే వాళ్లం. ఎన్నో కేసుల పాలైనం. ఎడ్లను కూడా కొట్టుకుని పోయిన్రు. ఎప్పుడు ఎవుసం ఆపుతారోనని భయపడేది. ఇప్పుడు అవన్నీ పోయినయ్. ఎన్కట పట్టాలియ్యాలని అధికార్ల సుట్టు తిరిగినా పనికాలే. పట్టాలుంటెనే భూమికి విలువ.
– గుగులోతు లచ్చిరాం, వేపచెట్టు తండా
ఇంతకాలం అప్పులు పుట్టలే..
పంట పెట్టుబడి కోసం అప్పులు పుట్టలే. బ్యాంకులు కూడా ఇయ్యలే. వడ్డీ వ్యాపారుల దగ్గర కు పోయి ఎక్కువ వడ్డీకి అప్పు లు తెచ్చేది. పంటలు కూడా చివ రి వరకు చేతికి వత్తయనే నమ్మ కం లేకుండేది. ఎప్పుడు అటవీ శాఖ అధికారు లు వచ్చి పంటను దున్నేస్తారోనని భయపడాల్సి వచ్చే ది. ఎన్నో సార్లు దాడులు చేసి కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ సమస్యలు పోతయ్. భూమికి పట్టాలు ఇవ్వడం వల్ల రుణాలు కూడా ఇస్తరు. రైతుబంధు, రైతు బీమా కూడా వత్తది. ఇదంతా సీఎం కేసీఆర్ సార్ దయవల్లే జరిగింది.
– సిద్దనబోయిన సమ్మక్క, దబ్బీర్పేట