గీసుగొండ, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశాన్ని తన వైపు తిప్పుకున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలో రూ.3కోట్ల 83లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ధర్మారం రెవెన్యూ పరిధిలోని 590 మంది రైతులకు రూ.50లక్షల పంట నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మన కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి చూసి సీఎం కేసీఆర్ను ఆశ్వీదించాలని కోరారు. ఎన్నికల సమయంలో అనేక పార్టీల నాయకులు గ్రామాలకు వచ్చి అసత్య ప్రచారం చేస్తారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలను నమ్మొద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, రైతు బీమా, రైతు బంధు పథకాలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వటం లేదో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నది ఏకైక కేసీఆర్ ప్రభుత్వమన్నారు. తెలంగాణ రాష్ర్టానికి రావాల్సి నిధులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీస్సులు సీఎం కేసీఆర్పై ఉన్నాయన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణ సర్కారు తిరిగి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందన్నారు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ప్రజలు అశ్వీదించి అత్యధిక మోజార్టీతో గెలిపించాలని కోరారు. ధర్మారం గతంలో ఏట్లుండేది? ఇప్పుడు ఏట్ల ఉందని ప్రజలను ప్రశ్నించారు. గల్లీగల్లీలో రోడ్లు వేసినట్లు చెప్పారు. పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. గృహలక్ష్మి పథకంలో ఇండ్లు కట్టుకునే వారికి తప్పక ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అందులో దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతినెల కొత్త వారికి ఇండ్లు మంజూరు చేసుకునే ఆవకాశం ఉందని,ప్రజలు తమకు రాలేదని ఇబ్బంది పడొద్దని, అర్హులందరికీ తప్పకుండా ఇండ్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సుంకరి మనిషాశి కుమార్, 15, 17వ డివిజన్ల కార్పొరేటర్లు ఆకులపల్లి మనోహర్, గద్దె బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, రైతు బంధు సమితి మండల కన్వీనర్ వీరాటి లింగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, సొసైటీ చైర్మన్లు రడం శ్రీధర్, నాయకులు కిశోర్కుమార్, గంగుల రమేశ్, శ్రీధర్, శ్రీనివాస్రెడ్డి, సంజీవ, పిట్టలరాజు, స్వరూప, రాజయ్య, బాబు, మల్లేశం, బొల్లం రాజయ్య, నాగరాజు, కిష్టయ్య, వల్లెం శ్రీనివాస్ పాల్గొన్నారు.