పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 21: సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం సంతరించుకుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్లో నియోజకవర్గంలోని 290 మంది బీసీ కులవృత్తిదారులకు రూ.1లక్ష చొప్పున రూ.2.90కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం అందించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులందరికీ దశలవారీగా ఆర్థికసాయం అందుతుందని తెలిపారు. తొలివిడుతగా నియోజకవర్గంలో 290 మందికి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మరో 100 మంది కి త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు.
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కులవృత్తులు, వ్యవసాయం గత నిర్లక్ష్యంతో నిర్వీర్యం కాగా, సీఎం కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని తెలిపారు. మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ, గొల్లకుర్మలకు సబ్సిడీ గొర్రెల పంపిణీ, దళితులకు దళితబంధు, బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం, రైతులకు రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని పథకాలను ప్రవేశపెట్టిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బీసీల్లో 14 రకాల కులవృత్తిదారులకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తోందన్నారు. పాలకుర్తి మండలానికి చెందిన 47మంది, దేవరుప్పులకు చెందిన 42మంది, కొడకండ్లకు చెందిన 35మంది, రాయపర్తికి చెందిన 49మంది, పెద్ద వంగరకు చెందిన 47మంది, తొర్రూరు రూరల్కు చెందిన 55మంది, తొర్రూరు అర్బన్కు చెందిన 15మందికి మొత్తం 290మంది లబ్ధిదారులకు పంపిణీ చేశామని వివరించారు.
రజక, నాయీబ్రాహ్మణ, కమ్మరి, కుమ్మరి, పద్మశాలీ, మేదర, ఆరెకటిక, వడ్రంగి, వడ్డెర, ఉప్పర, సంగెర, విశ్వబ్రాహ్మణ, పూసల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, డీపీవో కే రంగాచారి, ఆర్డీవో వాసం రామ్మూర్తి, జిల్లా బీసీ అధికారి రవీందర్, పుష్పలత, ఎంపీపీలు జినుగు అనిమిరెడ్డి, బస్వ సావిత్రి, ఈదూ రు రాజేశ్వరి, తూర్పాటి చిన ఆంజయ్య, జడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాసరావు, మంగళంపల్లి శ్రీనివాస్, రంగు కుమార్, పల్లా భార్గవి సుందర్ రామిరెడ్డి, శ్రీరాం సుధీర్కుమార్, సర్పంచ్ వీరమనేని యా కాంతారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తీగల దయాకర్, మునావత్ నర్సింహానాయక్, ఈదూరు ఐలయ్య, సిందె రామోజీ, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, బిల్లా సుధీర్రెడ్డి, ఎర్రబెల్లి రాఘవరావు, కాకిరాల హరిప్రసాద్రావు, రామసాయం కృష్ణ కిశోర్రెడ్డి, తహసీల్దార్ టీ వెంకటేశం, ఎంపీడీఓ వనపర్తి అశోక్కుమార్, ఆకుల సురేందర్రావు, మున్సిపాల్ చైర్మన్ మంగళంపల్లి రాంచంద్రయ్య,సురేందర్రెడ్డి పాల్గొన్నారు.