హనుమకొండ, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మామిడి రైతులకు మళ్లీ కష్టాలు తప్పేలా లేవు. వరుసగా రెండో ఏడాది నష్టాలే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతికూల వాతావరణం, తెగుళ్ల తీవ్రతకు తోడు ప్రభుత్వపరంగా రైతులకు ఎలాంటి సస్యరక్షణ సలహాలు ఇచ్చే వ్యవస్థ లేకపోవడంతో మామిడి రైతులు ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుత సీజన్లో మామిడి తోటలకు పూత అత్యధిక స్థాయిలో వచ్చింది.
పూతలను చూసి అత్యధిక దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు ఆందోళనకరమైన పరిస్థితి వచ్చింది. చలి తీవ్రత, అసాధారణ వాతావారణం.. తామర(నల్లి పురుగు), తేనే మంచుతో పూత మొత్తం రాలిపోయింది. మామిడి సాధారణ దిగుబడితో పోల్చితే ఈసారి 20 శాతం మించకపోవచ్చని ఉద్యాన శాఖ తాజా అంచనాలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలోని సాధారణ వాతావరణ పరిస్థితుల ప్రకారం డిసెంబర్ నుంచి మామిడి పూత మొదలవుతుంది. జనవరి ఆఖరు నుంచి పూత పిందెగా మారుతుంది. ఈసారి రెండు వారాలు ముందుగానే మామిడి పూతలు వచ్చాయి. మన రాష్ట్రంలో ఈసారి చలి ఎక్కువ రోజులు ఉన్నది.
మధ్యాహ్నం అసలే ఎండలు రాని రోజులూ ఉన్నాయి. ఉదయం మంచు వాతావరణం కారణంగా తామర పురుగు సమస్య తీవ్రంగా ఉంటున్నది. తామర(నల్లి పురుగు), తేనె మంచుతో పూత మొత్తం రాలిపోయింది. జనవరి రెండోవారం నుంచి మధ్యాహ్నం పూట ఎండలు మొదలయ్యాయి. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పూసిన పూతలో 90 శాతం వరకు నల్లగా మారి రాలిపోయింది. వేడి వాతావరణం లేకపోవడంతో మిగిలిన కొద్ది పూత సైతం పిందెలుగా మారడం లేదు. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ డిమాండ్ ఉండే బంగినపల్లి రకం తోటలు 80శాతం వరకు మన దగ్గరే ఉన్నాయి. ఏటా సగటున 10.30లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతుండగా, రూ.1500కోట్ల వ్యాపారం జరిగేది.