మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశిర మాసంలో ధనూ రాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న ఈ మాసాన్ని మార్గ శీర్షమని పిలుస్తారు. ఈ మాసం దేవతల ఆరాధనకు ఎంతో శ్రేష్టం. కన్యామణులకు కోరిన వరాలిస్తారని నమ్మకం. శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడం వల్ల భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాస పుణ్యకాలంగా కొలుస్తారు. సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. అందుకే విష్ణువును ఈ మాసంలోనే ఆరాధిస్తారు. అలాగే సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపట్టడం అని కూడా పిలుస్తారు. వైష్ణవాలయాల్లో స్వామి వారికి పూజలతో పండుగ శోభ సంతరించుకుంటుంది.
వైష్ణవాలయాల్లో విశేష పూజలు
గోదాదేవి శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువ జామునే లేచి నిత్యం విష్ణువును పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై శ్రీరంగం రమ్మంటాడు. ఆ తర్వా త రంగనాథ స్వామితో వివాహం జరిగాక గోదాదేవి ఆయన పా దాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమవుతుంది.
ఈ కల్యాణాన్ని వీక్షించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. అంతటి ఆ మహా దేవి కూడా ధనుర్మాసానికి సమానమైన మాసం లేదంటూ తిరుప్పావైలోని మొదటి పాశురంలోనే చెబుతుంది. అలాగే శ్రీమహా విష్ణువును ఆరాధించడానికి.. ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ధనుర్మాసం విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. ఆలయాల్లో సుప్రభాతానికి బదులుగా గోదాదేవిచే విరచితమైన 30 పాశురాలను ఈ మాసం రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో (గానం) పారాయణం చేస్తారు. ఈ కారణంగానే వైష్ణవాలయాలు ధనుర్మాసంలో భక్తుల సందడితో కళకళలాడుతాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి.
ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు
ధనుర్మాసంతో ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మాసమంతా ఉదయం, గోధూళి వేళ నెల రోజులు ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల శ్రీమహాలక్ష్మి కరుణాకటాక్షలు సిద్ధిస్తాయనేది భక్తుల నమ్మకం. అలాగే మహిళలు సూర్యోదయానికి ముందే వాకిట్లో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పె డుతుంటారు. తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. గోదాదేవీ సమేత రంగనాథ స్వామిని పూజిస్తుంటారు. బహువిధ ప్ర యోజనకారి అయిన శ్రీ వ్రతాన్ని భక్తులు నిష్టతో ఆచరిస్తారు.
శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైనది ధనుర్మాసం. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి పండుగ రోజు వరకు ఈ మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు శ్రీమన్నారాయుడికి పూజలతో వైష్ణవ ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. సుప్రభాతానికి మారుగా తిరుప్పావైను పఠిస్తారు. ఈ మాసమంతా ఉదయం, గోధూళి వేళ ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల ఐష్టెశ్వరాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి.
– ఖిలావరంగల్, డిసెంబర్ 15
సకల శుభదాయకం.. గోదావ్రతం
ధనుర్మాసంలో గోదాదేవి తాను ఆచరించి మనకు అందించిన ‘తిరుప్పావై’ వ్రతాన్ని (శ్రీవతం) భక్తి శ్రద్ధలతో ఆచరించే వారికి సకల శుభాలు, మంగళాలు సంభవిస్తాయి. సామూహికంగా ఆచరించే ఈ వ్రతం వల్ల శ్రీకృష్ణానుగ్రహం లభించి భక్తులందరూ సర్వతోముఖ అభివృద్ధి చెందుతారు. వ్రతాన్ని ఆచరించే భక్తులు నేటి నుంచి వచ్చే 14 వరకు నెల రోజుల పాటు భగవన్నామ సంకీర్తనం చేయాలి. వేదసారాన్ని తెలిపే తిరుప్పావైలోని విశేషార్థాలను, రహస్యాలను, నిగూడార్థాలను పండితుల ప్రవచనాల ద్వారా తెలుసుకొని తరించాలి.
– సముద్రాల శఠగోపాచార్యులు, పండితులు