దామెర, ఫిబ్రవరి7 : మేడారం మహాజాతరలో సుమారు 14000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. బుధవారం హనుమ కొండ జిల్లా దామెర మండలం దుర్గంపేటలోని ఎన్ఎస్ఆర్ హోటల్లో మేడారం జాతర -2024పై మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. జాతర విజయవంతంలో మీడియా మిత్రులు కీలకపాత్ర పోషిస్తు న్నారని అన్నారు. ప్రజలకు జాతరలో పాటించాల్సిన జాగ్రత్తలు తెలియజేసే ఒకే ఒక మాధ్యమం మీడియా అని పేర్కొన్నారు. జాతరలో 1000 మంది మహిళా పోలీసులతో బందోబస్తుతో పాటు దొంగతనాలు జరుగకుండా 500 మంది సీసీఎస్ సిబ్బందితో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
గత జాత రలలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులను ప్రస్తుతం బందోబస్తుకు ఉపయోగించుకుంటున్నామని వివరించారు. 475 సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులు తమ వాహనాలను రహదారులపై ఆపవద్దని, గతంలో కన్నా 500 ఎకరాల స్థలాన్ని పారింగ్కు కేటాయించామని పేర్కొన్నారు. ప్రజలు సరైన విధంగా పోలీసు వారి మార్గదర్శకాలను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని సూచించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో వనదేవతలను దర్శించుకునేలా అన్ని చర్యలను పోలీస్ శాఖ తరపున తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ లక్ష్మణ్ రావు, దుగ్గొండి సీఐ కిషన్ (మేడారం జాతర మీడియా లైజనింగ్ ఆఫీసర్), స్పెషల్ బ్రాంచ్ సీఐ కిరణ్ పాల్గొన్నారు.