వరంగల్, అక్టోబర్ 21 : దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం అమ్మవార్లు పలు అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో భాగంగా భద్రకాళీ అమ్మవారు దుర్గా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించి, అమ్మవారిని సరస్వతీ మాతగా అలంకరించారు. సాయంత్రం రక్తబీజహా దుర్గార్చన, రథోత్సవం నిర్వహించారు. దుర్గా అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈవో శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నగరంలోని ఎంజీఎం సెంటర్ ఉన్న రాజరాజేశ్వరి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శాంభవి అలంకరణలో రాజరాజేశ్వరీ దేవీ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
హనుమకొండ : పద్మాక్షి దేవాలయంలో ఏడో రోజు అమ్మవారు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు నాగిళ్ల శంకర్శర్మ, ఆలయ వేద పండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని తెలిపారు. ఆలయంలో చండీహోమం, అన్నదానం చేపట్టారు.
హనుమకొండ చౌరస్తా : వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరీదేవికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, భవానీదేవిగా అలకరించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. అలాగే, ఉత్సవ సమితి సభ్యులు కోన శ్రీకర్ దాతృత్వంలో వివిధ రకాల కూరగాయలతో భవానీమాతను శాకాంబరీదేవిగా అలకరించారు. మహాచండీయాగం చేశారు. పల్లం రమేశ్, పులి రజినీకాంత్, గండ్రాతి రాజు సేవలందించారు. పలువురు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం సూత్రపు అభిషేక్తో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. భవానీదేవిని నెమలి వాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు. ఈవో వెంకటయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భీమదేవరపల్లి : కొత్తకొండలోని భద్రకాళీ అమ్మవారు మహిషాసురమర్థిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈవో కిషన్రావు, ఉపప్రధాన అర్చకుడు రాజయ్య, ముఖ్య అర్చకులు సదానందం, రాంబాబు, అర్చకులు శ్రీకాంత్, రమేశ్, వీరభద్రయ్య, వినయ్శర్మ, శరత్చంద్ర, శివకుమార్, శ్రవణ్, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రీధర్, సందీప్, రాజు, భిక్షపతి పాల్గొన్నారు.
న్యూశాయంపేట గ్రేటర్ 31వ డివిజన్ న్యూశాయంపేటలోని రాజరాజేశ్వర దేవాలయంలో ఏడో రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు పానుగంటి నాగేంద్రశర్మ ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వేలేరు : మండలంలోని పీచర, వేలేరు గ్రామాల్లో అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు హోమం తదితర పూజలు నిర్వహించారు. వేలేరులో దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కొలిపాక వెంకటేష్, రామ్శర్మ, సంతోష్శర్మ, భక్తులు పాల్గొన్నారు.