వర్ధన్నపేట, ఫిబ్రవరి 1 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దమ్మన్నపేటలో సీసీరోడ్లు, వర్ధన్నపేట పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో రూ.2 కోట్ల14లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బుధవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ర్టానికి నిధులను కేటాయించలేదన్నారు. కొత్త రైల్వే లైన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమని చెప్పారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా కోరుతున్నా కేంద్ర పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతేకాక ప్రాధాన్యతా రంగాలకు కూడా కేంద్రం మొండిచేయి చూపడం వల్ల అసంఘటిత కార్మికులు, రైతులు ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. కేంద్రానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అన్ని గ్రామాల్లో త్వరలోనే సీసీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. వర్ధన్నపేటలో మీ సేవ కేంద్రాన్ని ప్రారంభించారు.
కంటివెలుగు శిబిరం సందర్శన..
వర్ధన్నపేట 2వ వార్డులో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే రమేశ్ సందర్శించారు. ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచించారు. కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు సహకారం అందించాలన్నారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి పాల్గొన్నారు.