హనుమకొండ, సెప్టెంబర్ 10 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే గ్రామాల అభివృద్ధి జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణలో భాగంగా ఆదివారం హనుమకొండ కలెక్టరెట్లో జరిగిన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాలో 74 మందికి, వరంగల్ జిల్లాలో 126 మందికి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ప్రతి గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అధికారులు కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు. అంతకుముందు 8,690 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 3,414 గ్రామ కార్యదర్శులు ఉండే వారన్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందన్నారు. ఈ దుస్థితిని మార్చేందుకు 9,355 మంది కార్యదర్శులను కొత్తగా నియమించడంతో 2,769 మంది గ్రామ కార్యదర్శులు పనిచేస్తున్నారన్నారు. దీంతో ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి కలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణే అన్నారు. రాష్ట్రంలో 8,900 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తుండగా అందులో ఇప్పటివరకు 4,600 మందిని గ్రేడ్-4కు క్రమబద్ధీకరించినట్లు మంత్రి తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. పాత పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ద్వారా ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధిని మన రాష్ట్రంలో చేసి చూపించామని తెలిపారు.
కేంద్రంతో సమానంగా కేవలం మన ప్రభుత్వమే నిధులను మంజూరు చేస్తుండడం వల్ల ప్రతి గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతోందన్నారు. హరితహారం కార్యక్రమాన్ని సర్పంచ్లు పోటీపడి విజయవంతం చేస్తున్నారన్నారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతీ గ్రామానికి ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇవ్వడంతో ఉదయమే తడి, పొడి చెత్తను సేకరించి ఎరువును తయారు చేసే స్థాయికి జీపీలు చేరాయన్నారు. గంగదేవిపల్లె ఒక ఊరుకే ఆనాడు అవార్డులు వచ్చేవని, ఇప్పుడు అన్ని గ్రామాలు, ప్రతీ కేటగిరీకి దేశవ్యాప్తంగా అనేక అవార్డులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక విజన్తో చేసిన అభివృద్ధి వల్లనే నేడు మనకు అవార్డులు వస్తున్నాయన్నారు.
వచ్చే వినాయకచవితి నవరాత్రులు, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రతీ గ్రామంలో శానిటేషన్ నిర్వహణ పకాగా జరగాలని మంత్రి ఆదేశించారు. ప్రతీ గ్రామానికి తాగు నీరు, 24 గంటల కరెంట్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే, ప్రతి చెరువు నీటితో కళకళలాడుతోందన్నారు. ఒకప్పుడు పల్లెటూరుకి పోవాలంటే ఆలోచించే వారు నేడు ప్రతీ పండుగకు గ్రామాలకు పోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. కాగా, క్రమబద్ధీకరణ పొందిన కార్యదర్శులకు మంత్రి దయాకర్రావు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు పీ ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, అధికారులు పాల్గొన్నారు.