గిర్మాజీపేట, ఫిబ్రవరి 10: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన అనేక సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ దార్శనికతతో పలు పథకాలను రూపొందించారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశంలో మున్సిపల్ పద్దుపై మాట్లాడారు. ముఖ్యమంత్రి రూపొందించిన నూతన పథకాలను అమలు చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్న మంత్రి కేటీఆర్ విజయవంతం అయ్యారని కొనియాడారు. పట్టణ ప్రగతి, పచ్చదనం, వైకుంఠధామాలు, 75 చదరపు గజాల ఇంటి స్థలానికి మున్సిపల్ అనుమతిని మినహాయించడం, అర్బన్ మిషన్ భగీరథ ద్వారా నీరు అందించడం తదితర కార్యక్రమాలు పూర్తిస్థాయిలో విజయవంతం కావడం వల్ల మున్సిపల్ శాఖకు పలు అవార్డులు లభించాయని ఎమ్మెల్యే అన్నారు.
హైదరాబాద్ మహానగరాన్ని ఇంతకు ముందు ఎవరూ ఊహించని స్థాయిలో అభివృద్ధి పథంలో నిలిపారన్నారు. దుర్గం చెరువు, మూసీనది, హుస్సేన్సాగర్ తదితర వాటిని సుందరీకరించడం వల్ల ఆహ్లాద, ఆరోగ్యక వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రధానంగా అర్బన్ ప్రాంతంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేనందువల్ల మహిళలు, షుగర్ పేషెంట్లు, వృద్ధుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేదన్నారు. ఇప్పుడా సకల వసతులు కల్పించారని ఎమ్మెల్యే ప్రశంసించారు.
4,970 టాయ్లెట్ల నిర్మాణం
కొత్తగా 4,970 టాయ్లెట్లు నిర్మాణం కాగా, అందులో 4,118 మహిళలు, 258 పురుషుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే నరేందర్ వెల్లడించారు. హరితహారం కార్యక్రమం సజావుగా సాగేందుకు 1012 నర్సరీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జంతు సంరక్షణ కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్లు, బస్తీ దవాఖానలు, పట్టణ స్వయం సహాయక బృందాలకు బ్యాంకు లింకేజీలు కల్పించినట్లు పేర్కొన్నారు. భాషాపండితులకు పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. పల్లెల్లో రైతు బీమా పథకం ఉన్నట్లుగానే అర్బన్ ప్రాంతాల్లో కార్మిక బీమా ఏర్పాటు చేసి ఆదుకోవాలని ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, హైదరాబాద్లో ఆధునిక వసతులకు ఆలంభనగా నిలుస్తున్న సెక్రటేరియట్ భవన నిర్మాణాన్ని తల్లీకొడుకుల సంభాషణగా నన్నపునేని ఉదహరించి సభను ఆకట్టుకున్నారు.
కొడుకు: అమ్మా… ఇంత పెద్ద సచివాలయం ఎందుకు కట్టారు?
తల్లి: ‘తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా.. ఉద్యోగుల పనితీరుకు నిదర్శనంగా… సీఎం కేసీఆర్ విజన్ను అద్దంపట్టే నిషాన్గా హైదరాబాద్ నిలుస్తుంది’ అని నన్నపునేని గర్వంగా చెప్పారు. చార్మినార్, గోల్కొండ కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు సెక్రటేరియట్ ఉన్నతస్థాయి గుర్తింపు తెస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు మంత్రి కేటీఆర్ అభినందనలు మెప్మా సిబ్బందికి పే స్కేల్ సెర్ప్తో ఇవ్వాలని ఎమ్మెల్యే నరేందర్ మంత్రి కేటీఆర్ను కోరారు. మంత్రి సమాధానమిస్తూ ‘నరేందర్ మంచి సూచన చేశాడు. తప్పకుండా వారికి పే స్కేల్ అందేవిధంగా కృషి చేస్తాం’ అని నన్నపునేనిని అభినందించారు.