హనుమకొండ, జూలై 19 : బీసీలు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం సాధించాలంటే పల్లె నుంచి ఢిల్లీ వరకు ఐక్యంగా ఉద్యమించడమే మార్గమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్లోని మాస్టర్ జీ కళాశాల ఆడిటోరియంలో కుడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఓబీసీ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా బండా ప్రకాశ్తో పాటు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలుగు అకాడమీ చైర్మన్ వెంకటనారాయణ, మేర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాజంను సన్మానించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ బీసీల సమస్యలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, కులాల లెకలు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను కూడా తుంగలో తొక్కాయన్నారు. పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఉన్నత ఉద్యోగాల్లో బీసీల ప్రాతినిధ్యం అత్యల్పంగా ఉందన్నారు. బీసీలను అణగదొకడమే లక్ష్యంగా ఆధిపత్య కులాలు పనిచేస్తున్నాయన్నారు.
మెజారిటీ బీసీలకు మంత్రిత్వ శాఖ లేకుండా చేస్తున్నారని, ఇప్పటికీ జ్యుడీషియల్ కమిషన్ లేదని, అట్టడుగు వర్గాల నుంచి సుప్రీం కోర్టు జడ్జిలు లేరన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినా పూర్తి స్థాయిలో ప్రయోజనం అందలేదన్నారు. క్రిమిలేయర్తో బీసీలకు మరింత అన్యాయం జరుగుతున్నదని ఆరోపించారు. పల్లె నుంచి ఢిల్లీ వరకు బీసీ రాజ్యాధికార పోరాటం విస్తరించాలని, సంఘటిత కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మధుసూదనాచారి మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆధిపత్య కులాల చేతుల్లోనే రాజకీయ, ఆర్థిక శక్తి కేంద్రీకృతమైందన్నారు. బీసీలను రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్న పరిస్థితులు మారాలంటే పోరాటం చేయాల్సిందేనన్నారు.
డబ్బు రాజకీయాలు పెరగడంతో సాధారణ బీసీ నాయకులకు ఎన్నికల్లో పోటీ చేయడం కష్టంగా మారిందన్నారు. బీసీల మధ్య విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టి, ఐక్యంగా ముందుకు వస్తేనే రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుందన్నారు. బీసీలంతా ఒకటైతే భ్రష్టుపట్టిన రాజకీయాలను మార్చొచ్చన్నారు. బీసీల ఐక్య వేదిక క్రియాశీలకంగా పనిచేయాలని, ప్రతి జిల్లాలో ఇలాంటి సభలు జరపాలని సిరికొండ సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, ఓబీసీ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ గడ్డం భాసర్, డాక్టర్ కాళీ ప్రసాద్, సాంబారి సమ్మారావు, ఈగ మల్లేశం, బొనగాని యాదగిరి గౌడ్, వడ్నాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.