వరంగల్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడి పనిచేసినం.. నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అభ్యర్థులు చెబితే పోటీ విరమించుకున్నం.. ఎమ్మెల్యేలు ఎన్నికై రెండు నెలలు కావస్తున్నా నామినేటెడ్ పదవుల భర్తీపై ఎట్లాంటి కదలికల్లేవు.. పదేండ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా పదవుల పంపకంలో అధిష్టానం నిర్లక్ష్యం చేస్తున్నది’ అంటూ ‘ఆశావహులు’ వాపోతున్నారు. సంక్రాంతిలోపే అన్ని స్థాయిల్లో పదవులు భర్తీ చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగా మారుతున్నాయంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపైనా పదవులు ఇస్తారా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలకు పదవుల విషయంలో ఎమ్మెల్యేలు స్పందించడంలేదంటున్నారు.
నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ లీడర్లు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు దగ్గరపడుతున్నా, ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి ఇచ్చే పదవుల పంపకంపై స్పష్టత లేదు. పదవుల భర్తీ ప్రక్రియలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణిపై ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థలతోపాటు ఇతర రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల కోసం ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ పదవుల కోసం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వద్దకు రోజూ వెళ్లి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి పని చేశామని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటున్నారు. పదవుల పంపకం విషయంలో పార్టీ అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెబుతున్నారు. సంక్రాంతిలోపే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు తాత్సారం చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికలలోపైనా ఇస్తారా అని సందేహిస్తున్నారు.
టికెట్లు వదులుకున్నా..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులకు టికెట్లు దక్కలేదు. పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాంగ్రెస్ ప్రకటించింది. ఏండ్లుగా పార్టీ కోసం పనిచేసిన నేతలకు టికెట్ విషయంలో అన్యాయం జరిగింది. కొత్త వారికి టికెట్లు ఇచ్చేటప్పుడు పాత వారికి ఎమ్మెల్సీ, ఇతర రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పంపిన పరిశీలకులు టికెట్లు దక్కని నేతల ఇంటికి వెళ్లి మరీ ఎమ్మెల్సీ, ఇతర రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు ఇస్తామని చెప్పారు.
ఎన్నికలు ముగిసి దాదాపు రెండు నెలలవుతున్నా వీరికి పదవుల విషయంలో అధిష్టానం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి టిక్కెట్లు ఇచ్చి దశాబ్దాలుగా కాంగ్రెస్ కోసం పని చేసిన తమకు అన్యాయం చేశారని, ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీలోనూ జాప్యం చేస్తూ అలాగే చేస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే పార్టీకి వచ్చే ఇబ్బందులు ఏమిటో అర్థం కావడంలేదంటున్నారు. ఇతర నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారు.